డిగ్రీ, పీజీ కాలేజీల బంద్​ విరమణ

డిగ్రీ, పీజీ కాలేజీల బంద్​ విరమణ
  • విద్యాశాఖ ముఖ్యకార్యదర్శితో మేనేజ్​మెంట్ల చర్చలు సఫలం 
  • బకాయిల రిలీజ్​కు సర్కారు హామీ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న డిగ్రీ, పీజీ ప్రైవేట్​ కాలేజీల బంద్​ను విరమిస్తున్నట్టు తెలంగాణ ప్రైవేట్​ డిగ్రీ, పీజీ కాలేజీల మేనేజ్​మెంట్స్​ అసోసియేషన్ (టీపీడీఎంఏ) ప్రకటించింది. గురువారం సెక్రటేరియెట్​లో మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్యతో కలిసి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంతో టీపీడీఎంఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొజ్జ సూర్యనారాయణ రెడ్డి, యాద రామకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ పరమేశ్వర్ తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేనేజ్ మెంట్ల సమస్యలను ఆయనకు వివరించారు. 

రాష్ట్రంలో మూడేండ్ల నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెండింగ్​లో ఉన్నాయని చెప్పారు. ఐదారు నెలల నుంచి సుమారు రూ.1,200 కోట్ల బకాయిల రిలీజ్​కు టోకెన్లు విడుదలైనా.. ఇప్పటికీ ఆ డబ్బులు మేనేజ్​మెంట్ల ఖాతాల్లో పడలేదన్నారు. బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. బకాయిల విడుదలకు త్వరలోనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. దీంతో బంద్ విరమిస్తున్నట్టు మేనేజ్​మెంట్లు ప్రకటించాయి.