
- ఉదయం పరేడ్ గ్రౌండ్లో.. సాయంత్రం ట్యాంక్ బండ్ పై ప్రోగ్రామ్స్
- అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన రాష్ట్ర సర్కార్
- రాష్ట్ర గీతాన్ని జాతికి అంకితం చేయనున్న సీఎం రేవంత్
- సోనియా వీడియో సందేశం తర్వాత సీఎం ప్రసంగం
- ట్యాంక్బండ్పై కనుల పండువగా కార్నివాల్
- పటాకులు కాల్చి సంబురాల ముగింపు
హైదరాబాద్, వెలుగు : పదేండ్ల పండుగకు తెలంగాణ ముస్తాబైంది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేండ్లు పూర్తయిన సందర్భంగా అదిరిపోయేలా ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. ఈ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా.. అందరి తెలంగాణ అని చాటి చెప్పేలా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.
2009లో యూపీఏ హయాంలో తెలంగాణ ఏర్పాటు ప్రకటన.. ఆ తర్వాత ఎన్నో సంప్రదింపులు చేసి పార్లమెంట్లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కేంద్రంలోని కాంగ్రెస్ సర్కారు రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీనికి పదేండ్లు పూర్తయిన సందర్భంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో వైభవంగా ఏర్పాట్లు చేసింది. ఉదయం పరేడ్గ్రౌండ్లో, సాయంత్రం ట్యాంక్బండ్పై కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గడిచిన పదేండ్లుగా ఏ విషయంలో అయితే ఉద్యమకారులు, ప్రజలు అసంతృప్తిగా ఉన్నారో.. వాటిని సరిచేసుకుంటూ పదేండ్ల వేడుకకు సిద్ధమైంది.
ఈ వేడుకల్లో అందె శ్రీ రాసిన ‘జయ జయహే’ గీతాన్ని సీఎం రేవంత్ రాష్ట్ర గీతంగా రిలీజ్ చేసి, జాతికి అంకితం చేయనున్నారు. ఆవిర్భావ వేడుకలకు పార్టీలకు అతీతంగా ఉద్యమకారులకు ఆహ్వానాలు పంపారు. మాజీ సీఎం కేసీఆర్తో పాటు బీజేపీలో ఉన్న లీడర్లకు కూడా ఇన్విటేషన్లు ఇచ్చారు. గత సర్కార్ మాదిరిగా దుబారా ఖర్చులకు పోకుండా.. జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో ఆవిర్భావ వేడుకలను నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
అమరుల స్థూపం వద్ద నివాళి..
సీఎం రేవంత్రెడ్డి ఆదివారం ఉదయం 9.30 గంటలకు గన్ పార్క్లో అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. పోలీసు బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటుంది. తర్వాత తెలంగాణ అధికారిక గీతం ‘జయ జయహే’ను ఆవిష్కరిస్తారు. సోనియాగాంధీ వీడియో సందేశం వినిపించాక.. సీఎం ప్రసంగిస్తారు. పోలీసు సిబ్బందికి, ఉత్తమ కాంటింజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. సాయంత్రం ట్యాంక్ బండ్పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభమవుతాయి.
తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6.30కు సీఎం ట్యాంక్ బండ్కు చేరుకొని, అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. అక్కడే తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి.
స్టేజ్ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్పై ఇటు చివర నుంచి అటు చివరి వరకు ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. ఈ వాక్ జరుగుతున్నంత సేపు ‘జయ జయహే తెలంగాణ’ ఫుల్ వర్షన్ (13.30 నిమిషాల) గీతాన్ని విడుదల చేస్తారు. అదే వేదికపై కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణిని సన్మానిస్తారు. రాత్రి 8.50కు హుస్సేన్ సాగరం మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా పటాకులు కాల్చి వేడుకలను ముగిస్తారు.
ఐదు నెలల పాలనపై సీఎం ప్రసంగం..
డిసెంబర్ 7న రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో ప్రభుత్వ పరంగా ఏం చేశారనే అంశాలను సీఎం రేవంత్ రెడ్డి ఆవిర్భావ వేడుకల సందర్భంగా ప్రసంగంలో వివరించనున్నారు. అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ కంచెలు తొలగించి, దాన్ని ప్రజా భవన్గా మార్చి అక్కడే ప్రజావాణి కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. దీనిపై రేవంత్ ప్రసంగించనున్నారు. ఐదు గ్యారంటీల అమలును వివరించనున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంట్, రూ.500కే గ్యాస్ సిలిండర్పై ప్రస్తావించనున్నట్టు తెలిసింది. రైతుబంధు పంపిణీ, రుణమాఫీ వివరాలు వెల్లడించనున్నారు. గత పదేండ్లలో జరిగిన విధ్వంసం గురించి కూడా సీఎం ప్రసంగిస్తారని సమాచారం.