
- నిత్యం యాక్టివిటీ ఉండేలా డిజైన్ చేయాలి: సీఎం రేవంత్
- అసంపూర్తిగా ఉన్న భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలి
- ప్రతి నెలా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశం
- ఆర్ అండ్ బీ ఆఫీసర్లతో ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: కేరళ రాష్ట్రంలోని కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ ఎయిర్ పోర్టు ఉండాలని అధికారులకు సీఎం రేవంత్రెడ్డి సూచించారు. మామునూరు ఎయిర్పోర్టుకు సంబంధించి అసంపూర్తిగా ఉన్న భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. శనివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆర్ అండ్ బీ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా మామునూరు ఎయిర్ పోర్టుకు సంబంధించి పూర్తి వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. ఎయిర్పోర్టు భూసేకరణ, పెండింగ్ పనులకు సంబంధించిన వివరాలను అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఎయిర్పోర్టు వద్ద నిత్యం యాక్టివిటీ ఉండేలా డిజైన్ చేయాలని అధికారులకు రేవంత్ సూచించారు. విమాన రాకపోకలతోపాటు ఇతర యాక్టివిటీస్ ఉండేలా, వరంగల్ నగరానికి అస్సెట్ గా ఎయిర్పోర్ట్ నిర్మాణం ఉండేలా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ప్రతి నెలా తనకు ప్రోగ్రెస్ రిపోర్ట్ అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మామునూరు విమానాశ్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ధన్యవాదాలు తెలిపారు.
నాలుగైదు నెలల్లో ప్రారంభించేలా ప్లాన్
ఎయిర్పోర్ట్ కోసం దాదాపు వెయ్యి ఎకరాల భూమి అవసరమవుతుంది. ఇప్పటికే ఎయిర్పోర్టు పరిధిలో 696 ఎకరాల స్థలం ఉన్నది. ఆ భూమికి అదనంగా మరో 253 ఎకరాల్లో కొంత రన్వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ), నావిగేషన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టాలేషన్ నిర్మాణాలు చేపట్టనున్నారు. భూసేకరణకు అవసరమైన నిధులను కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ నెలలోనే భూసేకరణను కంప్లీట్ చేయనున్నారు. నాలుగైదు నెలల్లోనే విమానాల రాకపోకలు సాగించేలా ప్లాన్ చేస్తున్నారు.