పీకలలోతు అప్పులతో కొట్టు మిట్టాడుతున్న టీజీఎస్ఆర్టీసీకు అద్దె బస్సులు గుదిబండగా మారాయి. ఆదాయం ఆర్టీసీది... డబ్బు ప్రవేట్ వాహనాల యాజమానులకు అన్న ప్రశ్న ఉదయిస్తున్నది. అప్పులు తీర్చలేక... ఆదాయం లేక ఆర్టీసీ ఇక్కట్లు ఎదుర్కొంటూ అద్దెబస్సులతో సంస్థ మనుగడ ప్రమాదంలో చిక్కుకుంది.
ఒకపక్క ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకం ఉచిత ఆర్టీసీ ప్రయాణంతో సంస్థ ఆర్థికంగా కుదేలు అవుతోంది. ప్రగతి కోసం, ప్రజల కోసం, ఆర్టీసీ బస్సు చక్రం ప్రగతి చిహ్నం అంటూ నినాదాలు వల్లిస్తున్నా.. ఆర్టీసీ రూటు ఎటు అన్న ప్రశ్న ఉదయిస్తున్నది. ప్రజా రవాణా వ్యవస్థగా నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్న తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకు ప్రభుత్వం నుంచి ఆర్థికంగా చేయూత అందుతుందా? అనే ప్రశ్న వెలుగు చూస్తున్నది.
ఆర్టీసీని బలోపేతం చేసి ప్రజారవాణాను మెరుగు పర్చాల్సిన సర్కారు ప్రవేట్ ఎలక్ట్రికల్ బస్సులనుప్రోత్సహించడంతో అనేక సందేహాలుఅనుమానాలు వ్యక్తం అవతున్నాయి. అద్దె బస్సులు వల్ల ఆర్టీసీ మనుగడకు ప్రమాదం పొంచి ఉంది. ఆర్టీసీలో డీజిల్ ఇతర బస్సులు ప్రజలకు సేవలు అందిస్తుండగా కొత్తగా ప్రవేట్ పెట్టుబడిదారులు ఎలక్ట్రికల్ బస్సులు తయారు చేయించి వివిధ డిపోల్లో నడిపిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీని అనుమతించకుండా ప్రవేట్ సంస్థలకు ఎలక్ట్రికల్ బస్సులు తయారు చేసి ఆయా రాష్రాలోని ఆర్టీసీ సంస్థలో బస్సులు నడిపించుకోవాలన్న నిర్ణయం తెలంగాణ ఆర్టీసీకి ప్రమాదకరంగా మారింది. తెలంగాణ రోడ్డు రవాణాసంస్థ స్వయంగా ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేసి రవాణా వ్యవస్థను మెరుగు పర్చాల్సిన అవసరం ఉంది.
అద్దె బస్సులకు స్వస్తి చెప్పి స్వయంగా ఎలక్ట్రికల్ బస్సులను ఇతర బస్సులను తయారు చేయించి ప్రయాణికులకు అందుబాటులో తేవాలని ఆర్టీసీ కార్మిక జేఏసీ సమ్మె సైరన్ మోగించేందుకు సన్నద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ఒక అడుగు ముందుకు వేసి ఆశాజనకమైన నిర్ణయం తీసుకొని ఆర్టీసీ సంస్థను, కార్మికులను సంరక్షించాల్సిన బాధ్యత ఉంది.
-గుర్రం రాంమోహన్ రెడ్డి