
- 11 రకాల కీలక ఖనిజాల ఉత్పత్తికి పరస్పర సహకారం
- అధికోత్పత్తి, లేటెస్ట్ టెక్నాలజీ, రక్షణ, శిక్షణలో కోపరేషన్
- నోడల్ ఏజెన్సీగా సింగరేణిని నియమించినట్టు వెల్లడి
- క్వీన్ల్యాండ్ మంత్రి, ప్రతినిధి బృందంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ
హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రికల్ వెయికల్స్, సోలార్ పవర్, బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్స్కు డిమాండ్ నేపథ్యంలో వీటికి అవసరమైన క్రిటికల్ మినరల్స్ను ఆస్ట్రేలియాలోని క్వీన్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేందుకు తెలంగాణ సంసిద్ధత వ్యక్తం చేసింది. సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో క్వీన్స్ లాండ్ స్టేట్ మినిస్టర్ రోస్ బేట్స్, ఆ స్టేట్ప్రతినిధి బృందంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా క్రిటికల్ మినరల్స్ ఉత్పత్తి, వ్యాపార విస్తరణపై చర్చించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో వెనేడియం, కోబాల్ట్, ఇండియం, క్రోమియం, టైటానియం తదితర 11 రకాల క్రిటికల్ మినరల్స్ అవసరాలు ఉన్నాయని తెలిపారు. ఈ ఖనిజాల లభ్యత క్వీన్స్ లాండ్ లో అధికంగా ఉన్నందున పరస్పర లబ్ధి చేకూరే బిజినెస్ ఒప్పందంపై అవగాహనకు వచ్చామని తెలిపారు.
ఇండియాలో క్రిటికల్ మినరల్ మైనింగ్ లో తెలంగాణ కీలక భూమిక పోషించనుందని చెప్పారు. ఈ నేపథ్యంలో క్వీన్స్ లాండ్ తో క్రిటికల్ మినరల్స్ టెక్నాలజీ, మైనింగ్ రంగంలో పరస్పర సహకారం, భాగస్వామ్యానికి ముందడుగు వేయడం శుభ పరిణామమని పేర్కొన్నారు. రాష్ట్ర మైనింగ్ చరిత్రలో ఇది కీలక మైలురాయిగా నిలిచిపోనున్నదని అన్నారు. ఈ విషయంలో క్వీన్స్ లాండ్ బృందానికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారని చెప్పారు.
నోడల్ ఏజెన్సీగా సింగరేణి..
రాష్ట్రంలో 2029–2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యాన్ని సాధించి.. దేశానికే అదర్శంగా నిలవాలని ప్లాన్ చేస్తున్నట్టు భట్టి విక్రమార్క చెప్పారు. ఈ విషయంలో క్వీన్స్లాండ్ సహకారం తీసుకునే అవకాశం ఉందన్నారు. తెలంగాణ, క్వీన్స్ లాండ్ మధ్య కంబైన్డ్గా మైనింగ్, మినరల్ వ్యాపారానికి సింగరేణిని ఒక నోడల్ ఏజెన్సీగా నియమిస్తున్నామని చెప్పారు. సింగరేణి ఇప్పటికే క్వీన్స్ లాండ్కు చెందిన సిమ్టార్స్ తో రక్షణ, సీఎస్ఐఆర్ఓ సంస్థలతో మైనింగ్, టెక్నాలజీకి సంబంధించి ఒప్పందాలు చేసుకొని, సేవలు పొందుతున్నదని తెలిపారు.
ఇప్పుడు క్వీన్స్ లాండ్ మంత్రి సమక్షంలో క్రిటికల్ మినరల్స్ వెలికితీత, భారీ యంత్రాలు, సాంకేతికత, రక్షణ పెంపుదల, వెంటిలేషన్ మెరుగుదల, ఎక్కువ లోతులో ఉన్న బొగ్గు నిల్వల తవ్వకానికి సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీ అంశాలపై పరస్పర అవగాహనతో వ్యాపార ఒప్పందం కోసం ముందుకుపోతున్నట్టు చెప్పారు. . త్వరలోనే ఈ అంశాలపై అధ్యయనం, అవగాహన కోసం సింగరేణి నుంచి బృందాన్ని క్వీన్స్ లాండ్ కు పంపుతున్నట్టు వెల్లడించారు.
తెలంగాణకు సహకరిస్తం: క్వీన్స్లాండ్ మంత్రి రోస్బేట్స్
మైనింగ్ రంగంలో అపార అనుభవం ఉన్న సింగరేణితో ఇప్పటికే తమతో ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని క్వీన్స్ లాండ్ మంత్రి రోస్ బేట్స్ తెలిపారు. క్రిటికల్ మినరల్స్ అయిన కోబాల్ట్, టైటానియం, గ్రాఫైట్, క్రోమియం, టంగ్ స్టన్, యాం టీమోనీ, రీనియం, ఇండియంతో పాటు రేర్ ఎర్త్ మినర ల్స్ వంటి కీలక ఖనిజాలను తమతో కలిసి ఉత్పత్తి చేయ డానికి ఉమ్మడి భాగస్వామ్యంపై ప్రాథమికంగా అవగాహనకు వచ్చినట్టు చెప్పారు.