
- తాపీ మేస్త్రీ దుర్మరణం శిథిలాల కింద కార్మికుడు
- రంగంలోకి దిగిన సింగరేణి రెస్క్యూ బృందం
- 30 ఏండ్ల పాత బిల్డింగ్పైనే ఐదు అంతస్తుల నిర్మాణం
- అనుమతుల్లేకుండానే పనులు
- జీపీ సిబ్బంది నోటీసులు ఇచ్చినా పట్టించుకోని ఓనర్
- పిల్లర్లు కుంగడంతో కూలిన ఆరు అంతస్తుల భవనం
భద్రాచలం, వెలుగు: భద్రాచలం పట్టణంలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో తాపీ మేస్త్రీ ప్రాణాలు కోల్పోగా.. ఓ కార్మికుడు శిథిలాల కింద చిక్కుకుపోయాడు. అతన్ని కాపాడేందుకు సింగరేణి రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. శిథిలాల తొలగింపు ఆపేసి అండర్ గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించింది. పాత భవనంపైనే మరో ఐదు అంతస్తులు నిర్మిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శ్రీ విజయ కనకదుర్గా భవానీ దేవస్థానంలో శ్రీపతి నేషనల్ ఫౌండేషన్ పేరిట శ్రీపతి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఈ భవనాన్ని నిర్మిస్తున్నాడు. 35 ఏండ్ల కిందటి పురాతన భవనాన్ని కొన్న శ్రీనివాసరావు.. దానిపైనే అదనంగా మరికొన్ని నిర్మాణాలు చేపడ్తున్నాడు. అయితే, ఈ నిర్మాణానికి గ్రామపంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలుస్తున్నది.
9 అంగుళాల పిల్లర్లపైనే ఐదు అంతస్తులు
గ్రౌండ్ ఫ్లోర్ మినహా మిగిలిన ఐదు అంతస్తులను కూల్చేయాలని సెప్టెంబర్లోనే మరోసారి నోటీసులు ఇచ్చారు. అయితే, శ్రీపతి శ్రీనివాసరావు ఇవేవీ పట్టించుకోకుండా నిర్మాణ పనులు కొనసాగించాడు. అక్రమ నిర్మాణం గురించి ప్రశ్నించిన వారిపై కూడా ఆయన దాడి చేసినట్టు ఆరోపణలున్నాయి. నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోకుండా కేవలం 9 అంగుళాల పిల్లర్లతో నిర్మాణాలు చేపట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తున్నది. కనీసం 14 నుంచి 20 అంగుళాల మేర పిల్లర్లు ఉంటేనే భవనం నిలబడుతుందని, ఎలాంటి ప్లాన్, నిపుణుల పర్యవేక్షణ లేకుండా నిర్మాణం జరుగుతున్నా పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు పలువురు విమర్శిస్తున్నారు. ట్రస్టు పేరుతో శ్రీనివాసరావు వసూలు చేస్తున్న విరాళాలపై కూడా ఆరోపణలున్నాయి.కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సింగరేణి నుంచి రెస్క్యూ బృందాలను రప్పించారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బిల్డింగ్ కూలిన ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి సహాయక చర్యలపై ఆరా తీశారు.