చిటపట చినుకులు పడుతుంటే... వేడి వేడిగా శ్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తుంటే.. అది మాటల్లో చెప్పలేని అనుభూతి. మరింకెందుకాలస్యం... నోరూరించే చిల్లీ పనీర్, రైస్ మంచూరియా, హాట్ హాట్ ఎగ్ పఫ్, పెసర పునుగులు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చదివేయండి.
చిల్లీ పనీర్
కావాల్సినవి :
పనీర్ ముక్కలు : పావు కిలో
నూనె, ఉప్పు, నీళ్లు : సరిపడా
మిరియాల పొడి : చిటికెడు
కార్న్ఫ్లోర్ : పావు కప్పు
వెల్లుల్లి రెబ్బలు : పదిహేను
అల్లం : చిన్న ముక్క,
పచ్చిమిర్చి : 8
చక్కెర, వెనిగర్ : ఒక్కో టీస్పూన్
సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ : ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్స్
ఉల్లిగడ్డ, క్యాప్సికమ్ ముక్కలు : కొన్ని
తయారీ : ఒక గిన్నెలో పనీర్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, కొంచెం కార్న్ ఫ్లోర్ వేసి కలపాలి. కొన్ని నీళ్లు చల్లి మరికొంచెం కార్న్ ఫ్లోర్ వేయాలి. పాన్లో నూనె వేడి చేసి అందులో పనీర్ ముక్కల్ని వేగించాలి. మరో పాన్లో నూనె వేడి చేసి ఉల్లిగడ్డ తరుగు, వెల్లుల్లి, అల్లం తురుము వేసి వేగించాలి. అందులో కొన్ని వేడి నీళ్లు పోసి, సోయా సాస్, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు, మిరియాల పొడి, వెనిగర్, రెడ్ చిల్లీ సాస్ వేసి కలపాలి. చిన్న గిన్నెలో కార్న్ఫ్లోర్, నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని కూడా అందులో పోయాలి. ఆ మిశ్రమం దగ్గరపడ్డాక ఉప్పు, పనీర్ ముక్కలు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, క్యాప్సికమ్ ముక్కలు వేసి
కలిపితే చిల్లీ పనీర్ రెడీ.
ఆలూ - మటర్
కావాల్సినవి :
గోధుమ పిండి : ఒక కప్పు
నూనె, ఉప్పు, నీళ్లు : సరిపడా
వాము, జీలకర్ర, పసుపు, గరం మసాలా : ఒక్కోటి అర టీస్పూన్
మొలకెత్తిన పచ్చి బటానీలు : ఒక కప్పు
పచ్చిమిర్చి : మూడు
ఆలుగడ్డ, ఉల్లిగడ్డ : ఒక్కోటి
అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, నిమ్మరసం : ఒక్కో టీస్పూన్
కార్న్ ఫ్లోర్ : నాలుగు టేబుల్ స్పూన్లు.
తయారీ : ఒక గిన్నెలో గోధుమ పిండి, వాము, నూనె, ఉప్పు వేసి నీళ్లు పోసి కలిపి ముద్ద చేయాలి. మూతపెట్టి పది నిమిషాలు పక్కన పెట్టాలి. మిక్సీజార్లో మొలకెత్తిన పచ్చి బటానీ, పచ్చిమిర్చి, ఆలుగడ్డ తరుగు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. పాన్లో నూనె వేడి చేసి, జీలకర్ర, ఉల్లిగడ్డ తరుగు వేగించాలి. ఆ తర్వాత అందులో ఆలూ బటానీ మిశ్రమం కూడా వేసి కలపాలి. అందులో నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. ఆ పై పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, నిమ్మరసం, కొత్తిమీర వేసి కలపాలి. ఒక గిన్నెలో కార్న్ఫ్లోర్, నూనె వేసి పేస్ట్లా కలపాలి. రెడీ చేసిన పిండి ముద్దను ఉండలు చేసి, చపాతీల్లా వత్తాలి. ఒక్కో చపాతీకి ఆ పేస్ట్ పూసి, పిండి చల్లాలి. అలా నాలుగైదు చపాతీలను చేసి ఒకదానిపై ఒకటి పేర్చాలి. తర్వాత వాటన్నింటిని రోల్లా చుట్టి, రింగులుగా కట్ చేయాలి. వాటిని మరోసారి చపాతీల్లా వత్తి, నాలుగు ముక్కలుగా కట్ చేసి, ఒక్కోదాంట్లో ఆలూ బటానీ స్టఫ్ పెట్టి మూసేయాలి. వీటిని వేడి నూనెలో వేగిస్తే ఆలూ మటర్ పఫ్ తినడానికి రెడీ.
రైస్ మంచూరియా
కావాల్సినవి :
అన్నం : ఒక కప్పు
క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిగడ్డ, టొమాటో : ఒక్కోటి
పచ్చిమిర్చి : రెండు
ఉప్పు : సరిపడా
కారం, నిమ్మరసం : ఒక్కో టీస్పూన్
ధనియాల పొడి, చాట్ మసాలా, గరం మసాలా : ఒక్కోటి అర టీస్పూన్
జీలకర్ర పొడి : పావు టీస్పూన్
మైదా : అర కప్పు
కార్న్ ఫ్లోర్ : రెండు టీస్పూన్లు
టొమాటో కెచప్ : నాలుగు టీస్పూన్లు
తయారీ : మిక్సీజార్లో అన్నం వేసి, కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో మెత్తగా చేసిన అన్నం, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తరుగు వేయాలి. అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మైదా, కార్న్ ఫ్లోర్, నిమ్మరసం కూడా వేసి కలపాలి. చేతికి నూనె రాసుకుని తయారుచేసిన మిశ్రమాన్ని ఉండలుగా చేయాలి. అలా చేసిన వాటిని వేడి నూనెలో వేగించాలి.
సాస్ కోసం..
ఒక పాన్లో నూనె వేడి చేసి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, క్యారెట్, క్యాప్సికమ్, టొమాటో తరుగు ఒక్కోటి వేగించాలి. ఆ తర్వాత ఉప్పు, ధనియాల పొడి, చాట్ మసాలా, గరం మసాలా, కారం, టొమాటో కెచప్ వేసి కలపాలి. చివరిగా వేగించిన రైస్ బాల్స్ను అందులో వేసి కలిపితే రైస్ మంచూరియా రెడీ.
పెసర పునుగులు
కావాల్సినవి
పెసరపప్పు : ఒక కప్పు
ఉప్పు : సరిపడా
అల్లం : చిన్న ముక్క
పచ్చిమిర్చి : రెండు
కరివేపాకు : కొంచెం
మిరియాల పొడి : ఒక టీస్పూన్
తయారీ :
ఒక గిన్నెలో పెసరపప్పు వేసి, నీళ్లు పోసి కడిగాక నాలుగైదు గంటలు నానబెట్టాలి. మిక్సీజార్లో నానబెట్టిన పెసరపప్పు గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి అల్లం తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు తరుగు, మిరియాల పొడి వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేడి నూనెలో బోండాల్లా వేయాలి. అవి బాగా వేగాక ప్లేట్లోకి తీయాలి. వీటిని కొబ్బరి చట్నీతో తింటే భలే టేస్టీగా ఉంటాయి.
ఎగ్ పఫ్
కావాల్సినవి
గోధుమ పిండి : రెండు కప్పులు
కోడిగుడ్లు (ఉడికించి) : నాలుగు
ఉప్పు, నీళ్లు, నూనె : సరిపడా
వెన్న : మూడు టీస్పూన్లు
పచ్చిమిర్చి : మూడు ,
ఉల్లిగడ్డలు / టొమాటోలు : రెండేసి చొప్పున
కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ : ఒక్కో టీ స్పూన్
తయారీ :
గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు, వెన్న వేసి నీళ్లు పోసి కలిపి ముద్ద చేయాలి. దాన్ని చపాతీలా వత్తి, నూనె రాసి నాలుగు వైపులా మడతపెట్టాలి. తర్వాత ఒక గిన్నెలో పెట్టి మూతపెట్టి పక్కనపెట్టాలి. ఒక పాన్లో నూనె వేడి చేసి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టొమాటో తరుగు, ఉప్పు వేసి వేగించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. ఆ తర్వాత గిన్నెలో పెట్టిన పిండిని ఉండలు చేయాలి. తరువాత వాటిని చపాతీలా వత్తి, నూనె రాసి నాలుగు వైపులా మడతపెట్టి మరోసారి వత్తాలి. ఇలా మూడు లేదా నాలుగుసార్లు చేశాక, నాలుగు భాగాలుగా కట్ చేయాలి. ఒక్కోదాంట్లో రెడీ చేసిన స్టఫింగ్తోపాటు సగానికి కోసిన కోడిగుడ్డు పెట్టి మూసేయాలి. ఇడ్లీ ప్లేట్కి నూనె రాసి, వాటిని అందులో పెట్టాలి. మరో పాన్లో చిన్న గిన్నె బోర్లించి, దానిపై ఇడ్లీ ప్లేట్ పెట్టి మూతపెట్టాలి. కాసేపటి తర్వాత మూత తీసి వాటిని రెండోవైపు తిప్పాలి. మళ్లీ మూతపెట్టి ఉడికిస్తే ఎగ్ పఫ్ రెడీ.