ఫిబ్రవరి 4న రాష్ట్ర కేబినెట్​ సమావేశం.. అదే రోజు అసెంబ్లీ..

ఫిబ్రవరి 4న రాష్ట్ర కేబినెట్​ సమావేశం.. అదే రోజు అసెంబ్లీ..
  • ఉదయం 10 గంటలకు అసెంబ్లీ హాల్​లోనే మంత్రివర్గ సమావేశం
  • కులగణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్టులకు ఆమోదం అనంతరం సభలో చర్చ
  • నేడు వర్గీకరణపై నివేదికను అందజేయనున్న అక్తర్​ కమిషన్

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 4న రాష్ట్ర కేబినెట్​ సమావేశం కానుంది. అదే రోజు అసెంబ్లీ  ప్రత్యేక సమావేశాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు శాసనసభ సెక్రటరీ నర్సింహాచార్యులు ఉత్తర్వులు ఇచ్చారు. అసెంబ్లీ హాల్​లోనే  మంగళవారం ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్​ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమవుతుంది. సమగ్ర ఇంటింటి  కులగణన సర్వే నివేదికను ఆదివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలోని కేబినెట్ సబ్ కమిటీకి  ప్రణాళిక విభాగం సమర్పించింది.

ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై డాక్టర్​ జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏక సభ్య న్యాయ కమిషన్ తమ నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి  సోమవారం అందజేయనుంది. ఈ రెండింటిపై మంగళవారం కేబినెట్​ భేటీలో చర్చించి ఆమోదిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో చర్చించి ఆమోదిస్తారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు.