
- 25 కల్లా తుది ముసాయిదా రెడీ చేయాలి
- కంపెనీలు, అగ్రిగ్రేటర్లకు మధ్య సమన్వయం ఉండాలని సూచన
- ముసాయిదా బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణకు సీఎం ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: మే డే కల్లా ‘తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వర్కర్స్’ చట్టం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును ప్రజాభిప్రాయ సేకరణ కోసం అందుబాటులో ఉంచాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు, అభ్యంతరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని తుది ముసాయిదాను ఈ నెల 25వ తేదీకల్లా సిద్ధం చేయాలని మేడేకల్లా గిగ్ వర్కర్ల చట్టం ..సలహాలు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరించండి
సూచించారు. సోమవారం సెక్రటేరియెట్లో గిగ్ వర్కర్లు, యూనియన్ల ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, బీమా సదుపాయం, ఇతర హక్కులను కల్పించేలా కార్మిక శాఖ ‘తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వర్కర్స్ బిల్లు’ ముసాయిదాను తయారు చేసింది. అందులో పొందుపరిచిన అంశాలను అధికారులు ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ముసాయిదాకు పలు మార్పులు చేర్పులను సీఎం రేవంత్రెడ్డి సూచించారు. కార్మికుల భద్రతకు ప్రాధాన్యమివ్వడంతోపాటు కంపెనీలు, అగ్రిగేటర్లకు మధ్య సమన్వయం, సుహృద్భావం ఉండేలా కొత్త చట్టం ఉండాలన్నారు.
ఈ బిల్లు ముసాయిదాను వెంటనే ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచి, ప్రజాభిప్రాయం సేకరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ డెలివరీ, క్యాబ్స్ డ్రైవర్లు, ప్యాకేజ్ డెలివరీల్లో దాదాపు 4 లక్షల మంది గిగ్ వర్కర్లు పని చేస్తున్నారని, అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించాలని సీఎం సూచించారు. వీటితో పాటు అధికారులు ఈ ముసాయిదాలో పొందుపరిచిన అంశాలపై తుది కసరత్తు చేయాలని ఆదేశించారు.
ఎన్నికలకు ముందే హామీ..
గిగ్ వర్కర్లు, ప్లాట్ ఫామ్ వర్కర్ల భద్రతకు చట్టం తెస్తామని ఎన్నికలకు ముందే హామీ ఇచ్చిన విషయాన్ని సీఎం రేవంత్ గుర్తుచేశారు. దేశంలోనే మొదటి సారి గిగ్ వర్కర్లకు ప్రమాద బీమా సౌకర్యం అమలు చేశామని చెప్పారు. గిగ్, ప్లాట్ ఫాం వర్కర్లు మరణిస్తే రూ.5 లక్షల ప్రమాద బీమాను అందించేలా 2023 డిసెంబర్ 30న తమ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. కొత్తగా అమలు చేసే చట్టం కూడా దేశానికి, తెలంగాణ మార్గదర్శకంగా ఉండాలని అధికారులకు సూచించారు.
సీఎంతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, జయేశ్ రంజన్, సంజయ్ కుమార్తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు