ప్రభుత్వ వెబ్సైట్లు అప్డేట్ చేస్తలే..

ప్రభుత్వ వెబ్సైట్లు అప్డేట్ చేస్తలే..

కలెక్టర్లు, హెచ్ఓడీలకు పాత జిల్లాలు, పాత శాఖలే
పోలీస్ శాఖలోనూ అప్డేట్ కాని వివరాలు, ఫోన్ నంబర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ  వెబ్​సైట్​ను ఎప్పటికప్పుడు అప్​డేట్ చేయడం లేదు. వివిధ విభాగాలకు హెచ్​వోడీలుగా ఉన్న సీనియర్​ ఐఏఎస్​లు, కలెక్ట ర్లు, అదనపు కలెక్టర్లు బదిలీ అయి వారి స్థానంలో కొత్త వాళ్లు వచ్చినా..ఆ వివరాలను మార్చడం లేదు.  దీంతో  ఏ ఐఏఎస్ ఏ జిల్లాకు కలెక్టర్​గా ఉన్నారో, ఏ శాఖకు ఎవరు హెచ్​వోడీగా కొనసాగుతున్నారో సాధారణ జనాలు తెలుసుకోలేకపోతున్నారు.    

పైగా సెల్ ​ఫోన్ ​నంబర్లను అందుబాటులో ఉంచడం లేదు. ఉదాహరణకు telangana.gov.in  ప్రభుత్వ వెబ్​సైట్​లో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్​గా రాహుల్ రాజ్ ఉన్నారు. అయితే, రాహుల్ రాజ్ ఎప్పుడో ఆదిలాబాద్​ నుంచి బదిలీపై మెదక్ కలెక్టర్​గా వెళ్లారు. ఇప్పుడు ఆదిలాబాద్​ కలెక్టర్​గా రాజర్షి షా ఉన్నారు. ఇదొక్కటే కాదు..  కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్​గా వెంకటేశ్​ దొత్రే ఉన్నారు. 

అయితే ప్రభుత్వ వెబ్​సైట్ మాత్రం బొర్కడే హేమంత్​ సహదేవరావు పేరు చూపిస్తున్నది. మేడ్చల్ మల్కాజ్​గిరి కలెక్టర్​గా గౌతం పోట్రు ఉంటే.. గవర్నమెంట్ పోర్టల్​లో ఇంకా అమోయ్ కుమార్​ (ఎఫ్ఏసీ) అని ఉన్నది. అడిషనల్​ కలెక్టర్ల లిస్ట్ కూడా అలాగే ఉంచారు.  కేవలం కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు మాత్రమే కాకుండా.. వివిధ హెచ్​వోడీల పరిస్థితి అలాగే ఉన్నది. ఇంకా పాత ప్రిన్సిపల్​ సెక్రటరీలు, సెక్రటరీల పేర్లే దర్శనమిస్తున్నాయి. 

ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​కు వస్తే పీఆర్సీ చైర్మన్​గా శివశంకర్​ ఉన్నారు. ఆయన పేరునే సీనియర్​ కన్సల్టెంట్​గా వెబ్​సైట్​లో చూపిస్తున్నారు. ఇక హెల్త్​ విభాగంలో ఆరోగ్య శ్రీ సీఈవోగా కర్ణన్​ను ప్రభుత్వం నియమించింది. అయితే, ఆయనకు బదులుగా పాత సీఈవో శివశంకర్ ​పేరే ఉంది. ఇలా చాలా పేర్లు అప్​డేట్​ చేయడం లేదు. ఇక పోలీసు శాఖలోనూ గతంలో ఆయా కమిషనరేట్లు, జిల్లా ఎస్పీల ఫోన్​ నంబర్లు  వెబ్​సైట్​లో అందుబాటలో ఉంచేవారు.. కానీ, ఇప్పుడు అవన్నీ తీసేశారు.