93 లక్షల ఇండ్లకు ఇంటర్నెట్ : మంత్రి శ్రీధర్​ బాబు 

93 లక్షల ఇండ్లకు ఇంటర్నెట్ : మంత్రి శ్రీధర్​ బాబు 
  • 93 లక్షల ఇండ్లకు ఇంటర్నెట్..మూడేండ్లలో అన్ని  గ్రామాలకూ విస్తరిస్తం : మంత్రి శ్రీధర్​ బాబు 
  • ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు మంత్రి శ్రీధర్​ బాబు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 93 లక్షల ఇండ్లకు ఇంటర్నెట్​ కనెక్టివిటీని అందిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​ బాబు తెలిపారు.  టీ ఫైబర్​ ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్​ సౌకర్యాన్ని కల్పించే కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. బుధవారం సెక్రటేరియెట్​లో శ్రీధర్​ బాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా ఆ బృందానికి డిజిటలైజేషన్​ గురించి మంత్రి వివరించారు. దాంతో పాటు పైలట్​ ప్రాజెక్టులో భాగంగా ఇంటింటికీ ఇంటర్నెట్​ సౌకర్యాన్ని ప్రారంభించిన నాలుగు గ్రామాలను ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఇటీవల సందర్శించారు. దాని గురించి మంత్రికి వారు వివరించారు.

రంగారెడ్డి జిల్లా హాజిపల్లి, నారాయణపేట జిల్లా మద్దూరు, సంగారెడ్డి జిల్లా సంగుపేట, పెద్దపల్లి జిల్లాలోని అడవి శ్రీరాంపూర్​ గ్రామాల్లో ఇంటర్నెట్​ సౌకర్యంతో ప్రజలకు కలిగిన ప్రయోజనాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నామని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు వైజయంతీ దేశాయ్​, కింబర్లీ జాన్స్​ వెల్లడించారు. మూడేండ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకూ ఇంటర్నెట్​ కనెక్టివిటీని అందించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని మంత్రి చెప్పారు. ఇప్పటికే 32 వేల కిలోమీటర్ల పొడవున ఫైబర్​ ఆప్టిక్​ కేబుల్​ వేశామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేశ్​ మిశ్రా, టీ ఫైబర్​ ఎండీ వేణుప్రసాద్, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఇషిరా మెహతా, అరుణ్ శర్మ, స్యూ సంజ్ ఎంగ్​ పాల్గొన్నారు.