
షాద్నగర్, వెలుగు: అమెరికాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన స్టూడెంట్ మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రానికి చెందిన గంప రాఘవులు, -రమాదేవి దంపతులకు కొడుకు గంప ప్రవీణ్ (27), కుమార్తె ఉన్నారు. రెండేండ్ల క్రితం ఉన్నత చదువుల కోసం ప్రవీణ్ అమెరికా వెళ్లాడు. విస్కాన్సిన్ మిల్వాంకిలో నివాసం ఉంటున్నాడు.
ఖర్చుల కోసం ఓ స్టార్ హోటల్లో పార్ట్టైం జాబ్ చేస్తూ.. అక్కడే ఓ యూనివర్సిటీలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో ప్రవీణ్ నివాసం ఉండే ఇంటికి సమీపంలోని బీచ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి బుధవారం కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రవీణ్ మరణవార్తను అతని ఫ్రెండ్స్ ఇండియాలోని తల్లిదండ్రులకు చెప్పడంతో, వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.