
- ఈ నెల 30 వరకు దరఖాస్తులకు అవకాశం
- ఒక పేపర్కు రూ.750.. రెండు పేపర్లు రాస్తే వెయ్యి ఫీజు
- జూన్ 15 నుంచి 30 మధ్యలో టెట్ పరీక్షలు
- కాంగ్రెస్ సర్కారు వచ్చాక ఇది మూడో టెట్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్–2025) నోటిఫికేషన్ రిలీజైంది. ఈ నెల15 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనున్నది. ఈ మేరకు శుక్రవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, టెట్ చైర్మన్ ఈవీ నర్సింహారెడ్డి, టెట్ డైరెక్టర్ రమేష్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. దీంతో పాటు డిటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇన్ఫర్మేషన్ బులిటెమ్ ను ఈ నెల 15న https://schooledu.telangana.gov.in వెబ్ సైట్లో పెడ్తామని ప్రకటించారు. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు ఆన్ లైన్లో ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. ఎగ్జామ్ ఫీజు ఒక పేపర్ కు రూ.750, రెండు పేపర్లు రాయాలనుకుంటే రూ.వెయ్యి ఫీజు ఉంటుందని పేర్కొన్నారు. టీజీ టెట్ ఎగ్జామ్స్ జూన్ 15 నుంచి 30 తేదీల మధ్యలో నిర్వహించనున్నట్టు చెప్పారు. ప్రతిరోజూ రెండు సెషన్లలో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఫస్ట్ సెషన్ లో ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, సెకండ్ సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగునున్నది. జూన్ 9 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. కాగా, జులై 22న ఫలితాలు విడుదల చేయనున్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. వివరాలకు
https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ చూడాలని సూచించారు. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఉండనున్నది.