తెలంగాణలో 72వ మిస్ వరల్డ్ పోటీలు..

తెలంగాణలో 72వ మిస్ వరల్డ్ పోటీలు..

72వ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది.. మే 7 నుండి మే 31 వరకు జరగనున్న ఈ వేడుకలను హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు టూరిజం శాఖ సెక్రెటరీ స్మిత సబర్వాల్, మిస్ వరల్డ్ సంస్థ సీఈఓ జూలియా మొర్లే వెల్లడించారు. హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌ ప్రారంభ, ముగింపు వేడుకలు, గ్రాండ్‌ ఫినాలే నిర్వహించనున్నామని.. ఈ పోటీల్లో 120 దేశాల నుంచి యువతులు పాల్గొననున్నట్లు తెలిపారు. 

కాగా.. 2024లో 71వ మిస్ వరల్డ్ పోటీలు ముంబైలో జరిగాయి. 28 ఏళ్ళ తర్వాత 71వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిధ్యం ఇచ్చింది ఇండియా. ఈ పోటీలో జెక్ రిపబ్లిక్ కి చెందిన క్రిస్టినా పీజ్కోవా మిస్ వరల్డ్ గా గెలుపొందింది. 1996లో మొదటిసారి ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు జరగగా ఈ పోటీల్లో గ్రీస్‌కి చెందిన ఇరెనా స్క్లీవా కిరీటాన్ని గెలుచుకుంది. ఈ పోటీల్లో భారత్ టాప్ 5లో నిలిచింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ మిస్ వరల్డ్ పోటీలకు ఇండియా వేదిక కానుందని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ అండ్ సీఈఓ జూలియా మూర్లే తెలిపారు.

ప్రపంచ దేశాల అందగెత్తలు పాల్గొనే మిస్ వరల్డ్ పోటీలు ఈసారి మన హైదరాబాద్ లో జరగనున్నాయి.ప్రపంచంలోని అందగత్తెలు అందరూ ఓ చోట చేరడం.. అందులో ఒకరు విన్నర్ అవ్వడం. ఈ వేడుకని చూసేందుకు ప్రతి ఒక్కరు సిద్ధమవ్వడం.. ఇలా ఉంటుంది ప్రతి సంవత్సరం పరిస్థితి. అందాల పోటీల్లో ఏ దేశపు అందగత్తె కిరీటాన్ని అందుకుంటుందని అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆ కాంపిటీషన్ వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో జరగనున్నాయి.

మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ 

వార్షిక మిస్ వరల్డ్ ఫైనల్స్‌ను పర్యవేక్షించే బాధ్యత కలిగిన మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్, పోటీని ప్రపంచంలోనే అతిపెద్ద ఈవెంట్‌లుగా మార్చింది. ఈ సంస్థ వికలాంగులు .. వెనుకబడిన పిల్లలకు సాయం చేసేందుకు  స్వచ్ఛంద సంస్థల నుంచి విరాళాలు సేకరించింది .  100 కంటే ఎక్కువ దేశాలలో ఫ్రాంచైజీలతో, మిస్ వరల్డ్ అందాన్ని మించిన ప్రపంచ వేదికగా మారుతుంది.