
- అత్యంత ప్రమాదకరంగా ప్లంజ్పూల్ గొయ్యి
- టెట్రాపాడ్స్తో పూడ్చాలని ఇరిగేషన్ శాఖ యోచన
- ఎన్డీఎస్ఏ చైర్మన్కు లేఖ రాయాలని నిర్ణయం
- ఇటీవల సీడబ్ల్యూసీ చైర్మన్తో భేటీలో టెట్రాపాడ్స్ ప్రస్తావన
- ఎన్డీఎస్ఏకు లేఖ రాయాలని చైర్మన్ సూచన
- 2009లోనే గొయ్యి పడినా నేటికీ పట్టించుకోని ఏపీ
హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం డ్యామ్సేఫ్టీపై రాష్ట్ర సర్కార్ దృష్టి సారించింది. డ్యామ్ ప్లంజ్పూల్లో పడిన భారీ గొయ్యిని పూడ్చేందుకు నడుం బిగించింది. 2009లో వచ్చిన భారీ వరదలకు 47 మీటర్ల లోతు, 400 మీటర్ల వెడల్పుతో ఏర్పడిన ఈ గొయ్యిని పూడ్చి డ్యామ్ను కాపాడేందుకు ఇప్పటివరకు ఏపీ ఎలాంటి చొరవ చూపలేదు. అప్పటి నుంచి ఏటికేడాది ఆ గొయ్యి డ్యామ్ వైపునకు పెరుగుతున్నట్టు కొన్నాళ్ల క్రితం చేసిన స్టడీల్లో తేలింది. ఈ నేపథ్యంలోనే దాన్ని అలాగే వదిలేస్తే డ్యామ్ మనుగడకే ముప్పు ముంచుకొస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ విషయంలో మన అధికారులే చొరవ తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారు.
భారీ గొయ్యిని పూడ్చేందుకు టెట్రాపాడ్స్అనే సీసీ బ్లాక్స్(నాలుగు కోణాలుగా కోన్ఆకారంలో ఉండే బ్లాకులు) ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీనిపై నేషనల్డ్యామ్సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) చైర్మన్కు లేఖ రాయాలని నిర్ణయించారు. ఈ మేరకు స్టేట్డ్యామ్సేఫ్టీ ఆర్గనైజేషన్ అధికారులకు ఈఎన్సీ జనరల్బి.అనిల్కుమార్ ఇప్పటికే ఆదేశాలిచ్చారు.
సీడబ్ల్యూసీ ద్వారా ఏపీకి చెప్పించాలని..
ఇటీవల సీతారామ ప్రాజెక్టుకు టెక్నికల్ క్లియరెన్స్ కోసం ఢిల్లీలో మీటింగ్కు వెళ్లిన అధికారులు.. మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డితో కలిసి సెంట్రల్వాటర్కమిషన్(సీడబ్ల్యూసీ) చైర్మన్ఎంకే సిన్హాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులకు క్లియరెన్సులతో పాటు శ్రీశైలం డ్యామ్సేఫ్టీపైనా చర్చించారు. గొయ్యిని పూడ్చేందుకు టెట్రాపాడ్స్ను ఏర్పాటు చేస్తే డ్యామ్పటిష్టంగా ఉంటుందని ఎంకే సిన్హాకు అధికారులు వివరించారు.
ఆలోచన బాగుందని, ఎన్డీఎస్ఏ చైర్మన్కు లేఖ రాసి పంపాలని అధికారులకు ఎంకే సిన్హా సూచించారు. దీంతో ఎన్డీఎస్ఏకు లేఖ రాసి అక్కడి నుంచి సీడబ్ల్యూసీకి సిఫార్సు చేయించాలని నిర్ణయించారు. సీడబ్ల్యూసీ ద్వారా రిపేర్లు చేయించేలా ఏపీకి చెప్పిస్తేనైనా డ్యామ్ సేఫ్టీకి చర్యలు తీసుకుంటుందన్న యోచనలో అధికారులు ఉన్నారు. గొయ్యి పడినప్పటి నుంచి ఏపీ దాన్ని పూడ్చేందుకు చర్యలు తీసుకోలేదు.
ఎన్డీఎస్ఏ సూచనల మేరకు 2014లో నేషనల్ఓషనోగ్రఫీ ఇనిస్టిట్యూట్ద్వారా బాతిమెట్రిక్ సర్వే చేయించింది. గొయ్యిపడిన ప్రాంతంలో నీటి లోపలి నుంచి వీడియోలు తీశారు. శ్రీశైలం డ్యామ్ ఫౌండేషన్ను దాటి క్రాకులు పడుతున్నట్టు ఆ సర్వేలో గుర్తించారు. ఆ తర్వాత ఎన్డీఎస్ఏ చేసిన టెస్టుల్లోనూ అవే ఫలితాలు వచ్చాయి. వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించినా ఏపీ మాత్రం కనీసం స్పందించలేదు. కృష్ణా బోర్డు మీటింగుల్లో ఎన్నిసార్లు చెప్పినా ఏపీ పెడచెవిన పెట్టింది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం డ్యామ్కు ప్రమాదం జరిగితే రెండు రాష్ట్రాలకు పెను నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్న మన అధికారులే చొరవ తీసుకుని టెట్రాపాడ్స్ఆలోచనను సీడబ్ల్యూసీకి వివరించారు.
ఇంటర్లాక్ అవుతయ్..
టెట్రాపాడ్స్ను ఎక్కువగా బీచ్గట్లకు వాడుతుంటారు. తీరం కోతకు గురికాకుండా పలు చోట్ల వీటిని ఏర్పాటు చేస్తుంటారు. ముంబైలోని బీచ్లకు వెళ్తే ఈ టెట్రాపాడ్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. అక్కడ రోడ్డుకు ఆనుకునే బీచులు ఉంటాయి కాబట్టి.. తీరం కోతకు గురైతే రోడ్లు, ఇతర మౌలికవసతులకు నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు. ఆ టెట్రాపాడ్లనే ఇప్పుడు శ్రీశైలం ప్లంజ్పూల్ గొయ్యిలో ఏర్పాటు చేస్తే ప్రమాదాన్ని నివారించొచ్చని అధికారులు చెబుతున్నారు.
ఈ టెట్రాపాడ్స్ ఒకదానికొకటి ఇంటర్లాక్ అయ్యి.. స్పిల్ వే నుంచి వరద దూకినప్పుడు కోత లేదా గొయ్యి పడే ప్రమాదాన్ని నివారిస్తాయని, క్రాకులు డ్యామ్వైపునకు మరింతగా వెళ్లకుండా నిరోధిస్తాయని ఈఎన్సీ అనిల్కుమార్చెప్పారు. అయితే, ఆ గొయ్యిని పూడ్చేందుకు ఆ టెట్రాపాడ్స్ఎంత మేర అవసరమవుతాయి? ఎంత ఖర్చవుతుందన్న దానిపై మాత్రం ఇప్పుడే నిర్ధారణకు రాలేమని చెబుతున్నారు. సీడబ్ల్యూసీ ఈ ఆలోచనను ఏపీకి చెప్పి, ఏపీ ఓకే అంటే అప్పుడు మరోసారి సర్వే చేయించి టెండర్లు పిలిచాకే దానిపై క్లారిటీ వస్తుందంటున్నారు.