Ugadi 2025: కాలం.. శక్తి: ఉగాది వెనుక పరమార్థం ఇదే..!

Ugadi 2025: కాలం.. శక్తి: ఉగాది వెనుక పరమార్థం ఇదే..!

కాలం ఒక ప్రవాహం..అది నిరంతరం సాగుతూనే ఉంటుంది. దాన్ని ఆపడం, దానికి ఎదురెళ్లడం ఎవరి తరమూ కాదు. అయితే, మనిషి తన అవసరాలకు అనుకూలంగా కాలాన్ని విభజించుకున్నాడు. అలా కాలాన్ని పరిశీలించుకుంటూ దానికి తగ్గట్టు నడుచుకుంటూ తన బుద్ధికి పదును పెట్టుకున్నాడు. కాలానికి తగ్గుట్టుగా కర్మలు నెరవేర్చడంతోనే మనిషి 'జ్ఞాన ప్రయాణం' మొదలైంది. అదే ఈ యుగానికి.. 'ఆది' అయింది. కాల మహిమను గుర్తు చేసుకుంటూ తెలుగు వారు చేసుకునే మొదటి పండుగే ఉగాది! 

స్వశ్రీ చంద్రమానేన విశ్వావశు నామ సంవత్సర చైత్రమాసం ఉత్తరాయణం వసంత రుతువు శుక్ల పాడ్యమి ఆదివారం రేవతి నక్షత్రంలో ఈ ఏడది మార్చి 30న ఉగాది వచ్చింది. అనాదిగా వస్తున్న  ఉగాది పండుగ  ...యుగాది.. అన్న సంస్కృత పదం నుంచి పుట్టింది. మన వేదాలకు మంత్ర సృష్టి జరిగిన రోజును.. .  కాలం అడుగు పెట్టిన రోజుగా.. ఉగాది పండుగగా, కొత్త సంవత్సరాదిగా తెలుగువాళ్లు జరుపుకుంటున్నారు.

ప్రకృతి పండుగ..

మన సంప్రదాయంలో ఏ పండుగను చూసినా అది ప్రకృతితో ముడిపడి ఉంటుంది. అందులోనూ ఉగాది అయితే.. దాన్ని ఏ కోణంలో చూసినా ప్రకృతి ఆధారంగానే కనిపిస్తుంది. వసంత రుతువు వచ్చిందని తెలియజేసే పండుగ ఉగాది ఉగాది నాటికి చుట్టు పక్కన ఏ చెట్టును చూసినా లేత ఆకులతో పచ్చగా కనువిందు చేస్తుంటుంది. ఆ సంతోషం కోయిల పాటల్లో. నెమలి నాట్యాల్లో కనిపిస్తుంది. వసంతుడిఆటల్ని చూసి మనసు పరవశించి పోకుండా..ఉండగలదా! 

ఉగాది వెనక.. 

ఉగాది పండుగ వెనక ఉన్న కథనాన్ని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చెప్తారు. ఉగాది.. ఉగ.. అంటే నక్షత్ర గమనం, జన్మ ఆయుష్షు అని అర్థాలు ఉన్నాయి. వీటికి ఆది ఉగాది. అంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి ఆయుష్షుకు మొదటిరోజునే ఉగాదిగా మారిందంటారు. చైత్ర శుద్ధ పాడ్యమి నాడే కలియుగం మొదలైందని....త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిందని మరో కథనం. ఆ రోజే శ్రీమహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించాడని పురాణాల్లో ఉంది. బ్రహ్మదేవుడు సృష్టిని మొదలు పెట్టిన రోజే ఉగాదని అంటారు. 

Also Read:-ఉగాది పచ్చడిలో ఆరు రుచులు.. ఆరు సంకేతాలకు సూచికం..

మొదటి తెలుగు చక్రవర్తి శాలివాహనుడు ఉగాది రోజునే సింహాసనాన్ని అధిష్టించాడనేది కూడా ప్రచారంలో ఉంది. ఉగాది రోజు నుంచే తెలుగు సంవత్సరం మొదలవుతుంది: కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగగా పేరుగాంచింది. అయితే, తెలుగు రాష్ట్రాలతో పాటుఇతర రాష్ట్రాల్లో కూడా ఉగాదిని గొప్పగా జరుపు కుంటారు. తెలుగు రాష్ట్రాలు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​)  ఉగాది ( సంవత్సరాది).. కర్ణాటక,  మహారాష్ట్రలో ..గుడిపాద్వా... తమిళనాడులో ....పుత్తాండు.. అనే పేరుతో... కేరళలో...విషు...., పంజాబ్​ లో  ....వైశాఖీ.... బెంగాల్లో ....పొయిలా బైశాఖ్ అనే పేర్లతో ఉగాది పండుగను జరుపుకుంటారు. 

ఏమేం చేస్తారు? 

రెండు మూడు రోజుల ముందు నుంచే పండగ పనులు మొదలవుతాయి. ఉగాది రోజు పొద్దున్నే ఇంటిని శుభ్రంచేసుకుంటారు. తైల అభ్యంగన స్నానం చేసి గుమ్మానికి మామిడి తోరణాలు, వేపాకు తోరణాలు కడతారు. కొత్త బట్టలు వేసుకొని కొత్త కుండ కొనడంతో సందడి మొదలవుతుంది. ఒకవైపు పచ్చడి తయారు చేస్తుంటే.. మరోవైపు వేడివేడిగా బక్ష్యాలు తయారవుతుంటాయి. పచ్చడి, వంటలు ఇష్టమైన దేవునికి నైవేద్యంగా పెట్టి, కొత్త సంవత్సరం అంతా శుభం కలగాలని కోరుకుంటారు. తర్వాత ఇంటిల్లిపాది పరగడపున ఉగాది పచ్చడి తిని, తర్వాత బక్ష్యాలు తింటారు. 

ఉగాదినాడు.. తెలంగాణలో కొన్ని పల్లెల్లో మాంసం కూడా తింటారు. కోడి పుంజులను కోసి గ్రామ దేవతల మొక్కులు తీర్చుకుంటారు. కొత్త పనులు, కొత్త వ్యాపారాలు కూడా ఉగాది నాడు మొదలు పెడుతుంటారు కొందరు. ఈ రోజు చేసే తైల అభ్యంగన స్నానం శరీరానికి నువ్వులు నూనె పట్టించి నలుగుపిండితో చేసే స్నానం) శరీరంలో ఉన్న టాక్సిన్స్ (విషపదార్థాలు)ను తొలగిస్తుంది. 

పంచాంగ శ్రవణం.. కవి సమ్మేళనం 

ఉగాది రోజు పంచాంగ పంచాంగ శ్రవణం చేస్తారు. ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల ఈ సంవత్సరంలో జరగబోయే మంచి చెడులతో పాటు పరిణామాలు తెలుసుకుంటారు. కలియుగంలో తిథి. నక్షత్ర ఫలితాలతో పాటు రాశిఫలాలు, ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు తెలుసుకుంటారు. ఇది జాగ్రత్తగా నడుచుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే, ఉగాది రోజు కవులు ప్రత్యేకంగా 'కవి సమ్మేళనం' నిర్వహిస్తారు. కొత్త, పాత కవులు కొత్త ఆలోచనలు. పాత ఒరవళ్ళు కలిపి కొత్త పద్యాలు, కవితలు రచించి, చదువుతారు.