
తెలుగు రాష్ట్రాల నుంచి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు భారీగా పెరిగారు. ఎన్ఎస్ఈ డేటా ప్రకారం.. తెలంగాణ నుంచి సుమారు 48 లక్షల డీమాట్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. ఇందులో గత ఐదేండ్లలోనే 37 లక్షల కొత్త అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. అదే ఆంధ్రప్రదేశ్ నుంచి 97 లక్షల డీమాట్ అకౌంట్లు ఓపెన్ కాగా, గత ఐదేండ్లలోనే 69 లక్షల అకౌంట్లు క్రియేట్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల ఇన్వెస్టర్లు ట్రేడింగ్పై బాగానే ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) వంటి క్లిష్టమైన సెగ్మెంట్లో ట్రేడింగ్ చేస్తున్న వారు పెరుగుతున్నారు.
అలానే పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు కూడా. సెబీ డేటా ప్రకారం, కిందటేడాది సెప్టెంబర్ 29 నాటికి ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్లో ఎక్కువ నష్టపోయిన వారిలో మనవారే ముందున్నారు. తెలంగాణ ఎఫ్ అండ్ ఓ ట్రేడర్లు 2023–24 లో సగటున రూ.1.97 లక్షలు నష్టపోగా, ఆంధ్రప్రదేశ్ ట్రేడర్లు సగటున రూ.1.45 లక్షలు లాస్ అయ్యారు. ఇంకా ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ చేసి నష్టపోయిన వారిలో దక్షిణాది రాష్ట్రాల ట్రేడర్లే ఎక్కువగా ఉన్నారు. ఎఫ్ అండ్ ఓ ట్రేడర్ల సంఖ్యను బట్టి తెలంగాణ 12వ ప్లేస్లో, ఆంధ్రప్రదేశ్ 13 వ ప్లేస్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 2.1 లక్షల మంది ఈ సెగ్మెంట్లో ట్రేడ్ చేస్తున్నారు.