
- ఆసిఫాబాద్లో అత్యధికంగా 42.4 డిగ్రీల టెంపరేచర్
- మరో 9 జిల్లాల్లో 41 డిగ్రీల కన్నా ఎక్కువే
- ఈ నెల 21, 22 తేదీల్లో తేలికపాటి వర్షాలకు చాన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వడగాడ్పులు మొదలయ్యాయి. ఉదయం పదకొండు దాటిందంటే చాలు.. ఎండ మంటలు రాజేస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం కూడా వడగాడ్పుల ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత మరింత పెరిగింది. టెంపరేచర్లు 42 డిగ్రీల మార్క్ను దాటేశాయి. 22 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. అందులో 9 జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా రికార్డ్ అయిన జిల్లాలున్నాయి.
ఆసిఫాబాద్లో అత్యధికం
అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్లో 42.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ, మంచిర్యాల జిల్లా అందుగులపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిల్లో 41.5 డిగ్రీల టెంపరేచర్ రికార్డయింది. వనపర్తి జిల్లా వెల్గొండలో 41.3, నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో 41.2, జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో 41.1, సిద్దిపేట జిల్లా బెజ్జంకి, మెదక్ జిల్లా దామరంచ, నిజామాబాద్జిల్లా కేంద్రంలో 41 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, భద్రాద్రి, కామారెడ్డి, నిర్మల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్నగర్, వికారాబాద్, కరీంనగర్, జోగుళాంబ గద్వాల, ములుగు జిల్లాల్లో 40.2 నుంచి 40.8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. మిగతా జిల్లాల్లో 38.4 డిగ్రీల నుంచి 39.8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా వరంగల్ జిల్లా దుగ్గొండిలో 38.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. హైదరాబాద్ సిటీలో 39.6 డిగ్రీల మేర ఎండ వేడి రికార్డయింది. కాగా, నిరుడు ఇదే సమయంలో రాష్ట్రంలో హయ్యెస్ట్ టెంపరేచర్ 40.9 డిగ్రీలు.. నిర్మల్ జిల్లాలో నమోదైంది.
21, 22న తేలికపాటి వర్షాలు
ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం ఉండగా.. సోమవారం కూడా ఆ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది.
అయితే, రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులేమీ ఉండబోవని, ఆ తర్వాత మాత్రం కాస్తంత తగ్గే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 21, 22వ తేదీల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు చాన్స్ ఉందని వెల్లడించింది. హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు 38 నుంచి 39 డిగ్రీల మధ్యనే రికార్డ్ అవుతాయని, వాతావరణం మబ్బు పట్టి ఉంటుందని పేర్కొంది.