ఫిబ్రవరిలోనే మంటలు .. 22 జిల్లాల్లో 37 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు

ఫిబ్రవరిలోనే మంటలు .. 22 జిల్లాల్లో 37 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. పలు చోట్ల సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా రికార్డవుతున్నాయి. దాంతో పాటు ఉక్కపోత తీవ్రత కూడా క్రమంగా పెరుగుతున్నది. 22 జిల్లాల్లో వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల కన్నా ఎక్కువగా రికార్డ్​ అవుతున్నాయి. మిగతా జిల్లాల్లోనూ 36కు పైగానే నమోదవుతున్నాయి.చలిగాలులను తీసుకొచ్చే వెస్టర్లీస్​  నిష్క్రమించడం.. బంగాళాఖాతం మీదుగా తూర్పు, ఆగ్నేయం నుంచి గాలులు వీస్తుండడంతో వాతావరణం వేడెక్కుతున్నదని అధికారులు చెప్తున్నారు. 

మార్చి​ఫస్ట్​ వీక్​ వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్నారు.  ఆ తర్వాత కొన్ని రోజులు వాతావరణం స్టెబిలైజ్​ అవుతుందని, కొన్నాళ్లకు ఉష్ణోగ్రతల్లో పెరుగుతుందన్నారు. మేలో ఈసారి రికార్డ్​ స్థాయిలో టెంపరేచర్లు ఉంటాయన్నారు. మంగళవారం ఆదిలాబాద్​లో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జోగుళాంబ గద్వాల, కామారెడ్డి, మంచిర్యాల, ములుగు, నిర్మల్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్​కర్నూల్, నిజామాబాద్, వనపర్తి, జగిత్యాల, జయశంకర్​ భూపాలపల్లి, మహబూబ్​నగర్, సంగారెడ్డి జిల్లాల్లో 37 డిగ్రీలకన్నా ఎక్కువగా రికార్డయ్యాయి. 

రాత్రి ఉష్ణోగ్రతలు జంప్​..

రాష్ట్రంలో ఇక చలికాలం అయిపోయినట్టేనని అధికారులు అంటున్నారు. ఒక్క రంగారెడ్డి జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా 15 డిగ్రీలకుపైగానే రాత్రి టెంపరేచర్లు రికార్డవుతున్నాయి. హనుమకొండ, హైదరాబాద్, రామగుండం, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్​నగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సోమవారం రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలకు మించి నమోదయ్యాయి. అత్యధికంగా భద్రాచలంలో 21.8 డిగ్రీల మేర రాత్రి టెంపరేచర్​ రికార్డయింది. 

నిజామాబాద్​లో 21.3, హైదరాబాద్, మహబూబ్​నగర్​లో 21.1, ఖమ్మంలో 21, రామగుండంలో 20.5, హయత్​నగర్, హకీంపేట, హనుమకొండలో 20 డిగ్రీల చొప్పున రాత్రి టెంపరేచర్లు రికార్డయ్యాయి. అత్యల్పంగా రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 14.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.