హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో రెండు మూడ్రోజుల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు చోట్ల 43 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు రికార్డ్ అవుతాయని శనివారం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. ఈ నెల 9వ తేదీ(మంగళవారం) నుంచి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తుందని తెలిపింది. కాగా, రెండ్రోజుల క్రితం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని, బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని చెప్పింది.
సోమవారం అల్పపీడనం ఏర్పడి.. మంగళవారం వాయుగుండంగా మారుతుందని, అది తుఫాన్గా బలపడుతుందని పేర్కొంది. ఆదివారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.