
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ సైదాబాద్పరిధిలోని దోబీఘాట్ రోడ్డులో ఉన్న భూలక్ష్మి ఆలయంలో ఈ నెల 14న అకౌంటెంట్పై జరిగిన యాసిడ్ దాడి కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. యాసిడ్ దాడి చేసిన నిందితుడితో పాటు చేయించింది కూడా పూజారే కావడం గమనార్హం. ఈ కేసు వివరాలను సౌత్ ఈస్ట్ డీసీపీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ ఆదివారం వెల్లడించారు.
ఈ నెల 14న భూలక్ష్మీ ఆలయంలో అకౌంటెంట్ నర్సింగ్రావుపై యాసిడ్ దాడి జరిగింది. నర్సింగ్ రావు గుడిలో కూర్చుని ఉండగా, గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ‘హ్యాపీ హోలీ’ అంటూ యాసిడ్ పోశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరు స్పెషల్టీమ్స్ ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకోవడానికి దాదాపు 400 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. దాడికి ముందు నిందితుడు గాంధీ భవన్ మెట్రో స్టేషన్ వద్ద టోపీ కొంటున్నట్టు గుర్తించారు. టోపీలు అమ్మే వ్యక్తిని విచారించి పేమెంట్ ఫోన్ పే ద్వారా చేశాడని తెలుసుకున్నారు.
ఆ ట్రాన్సాక్షన్, ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని షేక్పేటకు చెందిన పూజారి రాయికోడ్ హరిపుత్రగా గుర్తించారు. ఇతడిది మెదక్ జిల్లా సదాశివపేట. ఇతడిని విచారించి ఫోన్ చెక్ చేయగా భూలక్ష్మి టెంపుల్ పూజారి రాజశేఖర్ శర్మతో చేసిన వాట్సాప్ చాట్, కాల్స్ కనిపించాయి. రాజశేఖర్ శర్మే తనతో ఈ దాడి చేయించినట్టు నిందితుడు హరిపుత్ర చెప్పాడు. రూ.2 వేలకు బేరం కుదుర్చుకున్నాడని, రూ.వెయ్యి అడ్వాన్స్ గా ఫోన్ పే చేశాడని తెలిపాడు. దీంతో రాజశేఖర్శర్మను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పాత కక్షలతోనే నర్సింగ్ రావుపై దాడి చేయించానని రాజశేఖర్ శర్మ ఒప్పుకున్నాడు.