భూదాన్​ భూములపై ఆఫీసర్లలో టెన్షన్! నాలుగు సర్వే నంబర్లు.. నానా చిక్కులు

భూదాన్​ భూములపై ఆఫీసర్లలో టెన్షన్! నాలుగు సర్వే నంబర్లు.. నానా చిక్కులు
  • 181, 182 సర్వే నంబర్లలో భూములన్నీ భూదాన్ ​బోర్డువేనని తేల్చిన అధికారులు
  • 194,195 సర్వే నంబర్లలో భూములు కొన్న సీనియర్​ ఐఏఎస్​లు, ఐపీఎస్​లు
  • ఇవి ప్రైవేట్​ పట్టా భూములంటున్న అధికారులు.. కాదు భూదాన్, కంచ భూములంటున్న స్థానికులు
  • ఆధారాలతో హైకోర్టుకు వెళ్లిన ప్రైవేట్​ వ్యక్తి 
  • అక్రమ భూములు కొన్న ఈఐపీఎల్​ 
  • కన్​స్ట్రక్షన్స్​కే అభివృద్ధికి ఇచ్చిన ఉన్నతాధికారులు
  • రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు ఇచ్చే నివేదికపై సర్వత్రా ఆసక్తి

హైదరాబాద్, వెలుగు:రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం భూముల లొల్లి ఉన్నతాధికారుల మెడకు చుట్టుకుంటున్నది. గ్రామంలోని నాలుగు సర్వే నంబర్ల చుట్టూ నానా చిక్కులు నెలకొన్నాయి. 181, 182 సర్వే నంబర్లలోని భూదాన్​ భూముల అక్రమ బదలాయింపు వ్యవహారంలో ఇప్పటికే ఐఏఎస్​ అమోయ్​ కుమార్​ సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. 

ఇక194, 195  సర్వే నంబర్లలో  సీనియర్​ ఐఏఎస్​లు, ఐపీఎస్ ​అధికారులు భూములు కొనగా, అవి కూడా భూదాన్​ భూములే అని స్థానికులు హైకోర్టుకు వెళ్లడం.. వాటిని ప్రొహిబిటెడ్​ లిస్టులో చేర్చాలని జడ్జి ఆదేశించడం..  కొనుగోలు దారులకు నోటీసులు ఇవ్వడంతో ఐఏఎస్​, ఐపీఎస్​లు, రిటైర్డ్​ ఆలిండియా అధికారులు ఆందోళనలో పడ్డారు. 


అటు181, 182  సర్వే నంబర్ల పరిధిలోని భూదాన్​ భూముల వ్యవహారంలో ఈడీ రైడ్స్​ జరిగిన ఈఐపీఎల్​ కన్​స్ట్రక్షన్​​కంపెనీకే  ఐఏఎస్​లు, ఐపీఎస్​లు 194,195 పరిధిలోని తమ భూములను  డెవలప్​మెంట్​కు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.  అన్నీ తెలిసిన ఉన్నతాధికారులు.. భూదాన్​ భూములను అడ్డదారిలో పొందిన కంపెనీకి తమ భూములను డెవలప్​మెంట్​కు ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తున్నది.  

కాగా,194,195 సర్వే నంబర్లలో ఉన్నవి భూదాన్​ భూములు కావని ఉన్నతాధికారులు చెప్తుండగా, తాజాగా అవి కంచ భూములు అని, ధరణిలో రికార్డులను మార్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు ఇవ్వబోయే నివేదికపైనే సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

అవి పట్టా భూములే అంటున్న​ అధికారులు

నాగారం గ్రామంలో 194, 195 సర్వే నంబర్లలో పెద్దసంఖ్యలో ఐఏఎస్​లు, ఐపీఎస్ లు, రిటైర్డ్​ సివిల్​సర్వీస్​ అధికారులు భూములు కొనుగోలు చేశారు. ఈ సర్వే నంబర్లకు 2  కిలో మీటర్ల దూరంలో ఏపీలో పనిచేస్తున్న ఐఏఎస్​, ఐపీఎస్​లు ల్యాండ్ కొనుగోలు చేసి.. విల్లాలు కట్టేందుకు ఈఐపీఎల్​ కన్​స్ట్రక్షన్స్​ డెవలప్​మెంట్​కు ఇచ్చారు.

 ఈ క్రమంలో రాష్ట్రంలో పనిచేస్తున్న, రిటైర్​అయిన ఐఏఎస్​లు, ఐపీఎస్​లు సైతం తమ పేరుతో, కుటుంబసభ్యుల పేర్లతో సర్వే నంబర్​ 194లో భూములు కొని.. విల్లాల కోసం అదే ఈఐపీఎల్​కన్ స్ట్రక్షన్​కే డెవలప్​మెంట్​కు ఇవ్వడం గమనార్హం. 

ఇవి కూడా  భూదాన్, కంచ భూములేనని, అక్రమంగా పట్టా భూములుగా ప్రొసీడింగ్స్​జారీ చేసుకున్నారని, ఇందులో ఉన్నతాధికారుల పాత్ర ఉన్నదని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్​ దాఖలైంది. దీంతో న్యాయమూర్తి 76 మంది రెస్పాండెంట్లకు నోటీసులు జారీ చేశారు.  వీరిలో 30 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం  ఈ సర్వే నంబర్లలో ఎలాంటి భూదాన్​ భూములు లేవని ఉన్నతాధికారులు అంటున్నారు. 

  పహాణీలతోపాటు పాత రికార్డులను వెరిఫై చేయగా కంచ పట్టా భూములుగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఒకవేళ అవి పట్టా భూములేనని క్లారిటీ వచ్చినా.. ఈఐపీఎల్​ కన్​స్ట్రక్షన్స్​లో  అక్రమ లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు ఉన్నతాధికారులకు ఇబ్బందికరంగా మారాయి. 

అసలు కథంతా భూదాన్​ భూముల్లోనే !

 నాగారంలో 181, 182  సర్వే నంబర్లలో భూదాన్​ భూముల వ్యవహారంపైనా హైకోర్టు సీరియస్​గా ఉంది. 42 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిగా నోటిఫై చేసి, నిషేధిత జాబితాలో ఉంచినప్పటికీ, అప్పటి రంగారెడ్డి కలెక్టర్​ అమోయ్​కుమార్​ఆదేశాలతో మహేశ్వరం తహసీల్దార్​ సహా కొందరు అధికారులు అక్రమంగా ప్రైవేట్​వ్యక్తులకు బదలాయించారనే ఆరోపణలు వచ్చాయి. 

ఈ వ్యవహారంలో ఇప్పటికే మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేయగా, ఈడీ కూడా ఎంటరైంది. ఈక్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌‌తోపాటు  ఇతర అధికారులను, కొనుగోలుదారులు, మధ్యవర్తులతోపాటు ఈఐపీఎల్​కన్​స్ట్రక్షన్​ప్రతినిధులను విచారించింది.  2 నెలల కింద ఆ భూములను మళ్లీ భూదాన్​ భూములుగా నోటిఫై చేస్తూ సీసీఏఎల్ఏ​ నవీన్​ మిట్టల్​ ఉత్తర్వులు కూడా ఇచ్చారు. 

అంతకుముందు  ఈ భూముల కొనుగోళ్లలో బినామీల ద్వారా లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించింది.  హైదరాబాద్‌‌లోని 5  ప్రాంతాల్లో  దాడులు నిర్వహించగా, మొయినాబాద్‌‌లో భారీ నగదు, విలాసవంతమైన వాహనాలు స్వాధీనం చేసుకున్నది. ఈ దాడుల్లో నాగారంలోని 103 ఎకరాల భూదాన్ భూములను అక్రమంగా బదిలీ చేసినట్లు ఆధారాలు లభించాయని తెలుస్తున్నది. 

ఈ భూములు భూదాన్ యజ్ఞ బోర్డు నిబంధనల ప్రకారం పేద రైతులకు వ్యవసాయం కోసమో, లేదంటే  ప్రజాప్రయోజనాల కోసం మాత్రమే కేటాయించాలి. కానీ  నిబంధనలకు విరుద్ధంగా నకిలీ డాక్యుమెంట్లతో ప్రైవేట్​ వ్యక్తులకు రిజిస్ట్రేషన్​ చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

నోటీసు ఇవ్వకుండానే ఉత్తర్వులు జారీ: ఐపీఎస్​లు

ఎలాంటి నోటీసులివ్వకుండానే సింగిల్​ జడ్జి  ఉత్తర్వులు జారీ చేశారంటూ అప్పీలుదారులు పేర్కొన్నారు. 194, 195 సర్వే నంబర్​​లో 30 ఎకరాలుండగా, అందులోని భూములను కొనుగోలు చేశామన్నారు. 2023 నవంబర్​లో తెలంగాణ భూదాన్‌‌ యజ్ఞ బోర్డు.. సర్వే నెం.181లో 50 ఎకరాలను భూదాన్​ భూమిగా పేర్కొందన్నారు.ఆ జాబితాలో ​194  లేదని తెలిపారు. 2019లో ​194, 195ల్లోని భూములను పట్టా భూములుగా ప్రొసీడింగ్స్‌‌ జారీ చేశారని చెప్పారు.  

ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్నామని, ఊహాజనిత ఆరోపణలు తమకు నష్టం కలిగిస్తాయన్నారు. సింగిల్‌‌ జడ్జి ఉత్తర్వులను నిలిపివేయని పక్షంలో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఈ అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశాలున్నాయి.