
వరంగల్: వరంగల్ మామునూర్ ఎయిర్ పోర్టు ప్రాంగణం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల మామునూర్ ఎయిర్ పోర్టు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మామునూర్ ఎయిర్ పోర్టు క్రెడిట్ మాదంటే మాదంటూ అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలు శనివారం (మార్చి 1) పోటా పోటీగా సంబరాలు నిర్వహించాయి. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకే సమయంలో ఎయిర్ పోర్టు ప్రధాన గేటు వద్దకు చేరుకోవడంతో అక్కడ తోపులాట జరిగింది.
మూమునూర్ ఎయిర్ పోర్టు క్రిడిట్ మాదేనంటూ రెండు పార్టీల శ్రేణులు పోటా పోటీగా నినాదాలు చేశారు. ఎవరికి వారు తమ పార్టీ అగ్రనాయకుల ఫొటోలకు పాలభిషేకాలు చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఉద్రిక్త నెలకొనడంతో వెంటనే పోలీసులు అర్ట్ అయ్యారు. ఎయిర్ పోర్టు ప్రాంగణంలో భారీగా బలగాలను మోహరించారు. ఇరు పార్టీల కార్యకర్తలను అదుపు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను ఇరు పార్టీల నేతలు ఉల్లంఘించారు.