
లింగాల, వెలుగు: అక్రమంగా కట్టిన కాంపౌండ్వాల్ను పోలీసు బందోబస్తు నడము రెవెన్యూ అధికారులు శనివారం తెల్లవారుజామున కూల్చి వేయడంతో మండలంలోని అంబటిపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అంబటిపల్లి అసైన్డ్ భూమి సర్వే నంబర్ 732లో 5 ఎకరాల 29 గుంటల భూమి ఉంది. పీఏసీఎస్ చైర్మన్ తన ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం కొనుగోలు చేసి అందులో కాంపౌండ్ వాల్ నిర్మించడం వివాదాస్పదంగా మారింది.
గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఈ నెల 18న సర్వేయర్లు సర్వే చేసి ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించి మార్కింగ్ చేశారు. ఈ నెల 20న కాంపౌండ్ వాల్ను కూల్చివేయడానికి ప్రయత్నించగా, పీఏసీఎస్ చైర్మన్ హన్మంత్ రెడ్డి, ఆయన తండ్రి వెంకట్ రెడ్డి, కొందరు గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో తహసీల్దార్ పాండు నాయక్, ఆర్ఐ సీతారాం పర్యవేక్షణలో ప్రహారీగోడను కూల్చివేశారు. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడమేమిటని పీఏసీఎస్ చైర్మన్ ప్రశ్నించారు.