
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ఉన్మాదం దేశానికి ప్రమాదకరమని, దేశ భవిష్యత్కు గొడ్డలిపెట్టుగా మారుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఉన్మాదానికి, టెర్రరిజానికి మతం ప్రాధాన్యత కాదని, అలజడి సృష్టించడం, ప్రజలను హింసించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
శనివారం ఖమ్మం సిటీకి చెందిన వరద నర్సింహారావు వందలాది కార్యకర్తలతో సీపీఐలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్మాదులకు -మతం లేదని, గతంలో అనేక మంది ప్రముఖులను హతమార్చిన విషయంలోనూ ఇది రుజువైందన్నారు. టెర్రరిస్టు దాడిని అడ్డుకోవడంలో విఫలం చెందిన -తర్వాత దేశ ప్రజల ఆలోచనలను మళ్లించే రీతిలో మోదీ, అమిత్ వంటి నేతలు ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఉన్మాద చేష్టలను ఒక మతానికి, ప్రాంతానికి ముడి పెట్టడం సరికాదన్నారు.
కమ్యూనిస్టు పార్టీ పేదల పక్షాన పోరాడుతుందన్నారు. దేశ ప్రజలను చైతన్య పరిచే శక్తి ఉందన్నారు. అధికారం శాశ్వతం కాదని ప్రజల పక్షాన పనిచేయడమే అతిగొప్ప అధికారమన్నారు. సీపీఐ సిటీ కార్యదర్శి ఎస్కే జానిమియా అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహ్మద్ మౌలానా తదితరులు మాట్లాడారు. రాష్ట్ర సమితి -సభ్యులు జితేందర్రెడ్డి, యర్రాబాబు, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు -నర్సింహారావు, పోటు కళావతి తదితరులు పాల్గొన్నారు.