
- టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
హనుమకొండ, వెలుగు: రాబోయే పది సంవత్సరాల కాలంలో విద్యుత్తు డిమాండ్ కు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఇప్పటినుంచే సమాయత్తం కావాలని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి ఆఫీసర్లకు సూచించారు. ట్రాన్స్ కో, ఎన్పీడీసీఎల్ పరిధిలో రాబోయే పదేళ్ల కాలానికి చేపట్టాల్సిన భవిష్యత్తు యాక్షన్ ప్లాన్ పై గురువారం సాయంత్రం ఆయన రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే పదేళ్ల కాలంలో కొత్తగా సబ్ స్టేషన్లు, కొత్త లైన్లు, పవర్ ట్రాన్స్ ఫార్మర్లకు సంబంధించిన ప్రతిపాదనలు రెడీ చేసి, వివరణాత్మక రిపోర్ట్ అందజేయాలన్నారు. ట్రాన్స్ కో పరిధిలో కొత్తగా కరీంగనగర్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల పరిధిలో లోడ్ కు అనుగుణంగా కొత్తగా 132/ 33 కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణానికి ఆవశ్యకత ఉందన్నారు.
అదే విధంగా పవర్ ట్రాన్స్ ఫార్మర్లను పెంచాలన్నారు. డిస్కం పరిధిలో లోడ్ పెరిగే అవకాశం ఉన్నచోట్లా కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం, ప్రత్యామ్నాయ విద్యుత్తు సరఫరా అందించేలా ఇంటర్ లింకింగ్ చేపట్టాలన్నారు. ఆసిఫాబాద్ కౌటాలలో 132/33 కేవీ సబ్ స్టేషన్ అందుబాటులోకి వస్తోందని చెప్పారు. ప్రతి సెక్షన్ పరిధిలో ఏఈలు వారానికోసారి తప్పనిసరిగా పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. త్వరలోనే టీజీఎన్పీడీసీఎల్ డాష్ బోర్డు ప్రారంభిస్తామని చెప్పారు. ఎల్సీ యాప్ సేవలు విస్తరించాలన్నారు. ఈ సమావేశంలో ట్రాన్స్ కో డైరెక్టర్ జగత్ రెడ్డి , ఎన్పీడీసీఎల్ ఇన్ చార్జ్ డైరెక్టర్లు బి. అశోక్ కుమార్, టి.సదర్ లాల్, టి.మధుసూదన్ , ట్రాన్స్కో సీఈలు జి.శ్రవణ్ కుమార్, విజయ్ కుమార్, డిస్కం సీఈలు కె. తిరుమల్ రావు, రాజుచౌహాన్, అశోక్ , బికం సింగ్ తదితరులు పాల్గొన్నారు.