
- కంచ గచ్చిబౌలి భూములపై టీజీఐఐసీ కీలక ప్రకటన
- అది అటవీ భూమి కాదు.. చెరువు, నెమళ్లు, దున్నలు లేవు
- ఆ భూమంతా రాష్ట్ర సర్కారుదేనని సుప్రీంకోర్టు చెప్పింది
- కొందరు పొలిటికల్ లీడర్లు స్టూడెంట్లను తప్పుదోవ పట్టిస్తున్నరు
- ఆ ప్రాంతంలో సుస్థిరాభివృద్ధికి,సమగ్ర పర్యావరణ యాజమాన్య ప్రణాళికకు కట్టుబడి ఉన్నామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(టీజీఐఐసీ) కీలక ప్రకటన చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలో టీజీఐఐసీకి కేటాయించిన 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నది. ఇందులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)కి అంగుళం భూమి కూడా లేదని స్పష్టం చేసింది.
ఈ మేరకు సోమవారం టీజీఐఐసీ ఓ ప్రకటన జారీ చేసింది. తాము చేపడ్తున్న అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మష్రూమ్ రాక్స్తోపాటు ఇతర రాళ్ల అమరిక (రాక్ ఫార్మేషన్) సహజత్వాన్ని ఎట్టిపరిస్థితుల్లో దెబ్బతీయబోమని, పైగా వాటిని గ్రీన్ స్పేస్ కింద పరిరక్షించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని పేర్కొన్నది. మాస్టర్ప్లాన్లో భాగంగా ఈ ప్రాంత సుస్థిరాభివృద్ధికి సమగ్ర పర్యావరణ యాజమాన్య ప్రణాళిక (ఈఎంపీ) అమలుచేస్తామని వెల్లడించింది.
కొందరు నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించింది. ఆ భూమి యజమాని తానేనని కోర్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిరూపించుకున్నదని టీజీఐఐసీ గుర్తుచేసింది. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో ఎలాంటి చెరువులు (లేక్స్) లేవని, నెమళ్లు, దున్నలు లేవని క్లారిటీ ఇచ్చింది.
కొందరైతే ఆ 400 ఎకరాలు అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రెవెన్యూ రికార్డుల్లోనూ ప్రభుత్వ భూమిగానే ఉన్నదని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించిన సమగ్ర వివరాలను మీడియాకు టీజీఐఐసీ విడుదల చేసింది.
టీజీఐఐసీ వెల్లడించిన వివరాలు..
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి గ్రామం సర్వేనంబర్ 25లోని 400 ఎకరాల భూమిని 2004 జనవరి 13న నాటి ఏపీ ప్రభుత్వం క్రీడా వసతుల అభివృద్ధికి ‘ ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్’కు మెమో నంబర్ 39612/Assn/V(2) 2003 ప్రకారం కేటాయించింది.
ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ తన ప్రాజెక్టును ప్రారంభించకపోవడంతో 2006 నవంబరు 21న నాటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం: 111080/S1/2003 ప్రకారం ఆ కేటాయింపును రద్దు చేసి ‘ఏపీ యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్’కు అప్పగించింది.
భూ కేటాయింపులపై ‘ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్’ 2006లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ న్యాయపోరాటం సుదీర్ఘ కాలం కొనసాగింది. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణించింది. ఈ కేసులో (రిట్ పిటిషన్ నంబర్ 24781/2006) హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా 2024 మార్చి 7న ఉత్తర్వులు ఇచ్చింది.
హైకోర్టు తీర్పును ‘ఐఎంజీ అకాడమీస్’ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (సీ) నంబర్ 9265/2024 ద్వారా సవాల్ చేసింది. ఈ పిటిషన్కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం పోరాడింది. 2024 మే 3న సుప్రీంకోర్టు ఐఎంజీ అకాడమీస్ దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. దీంతో ఆ 400 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది.
టీజీఐఐసీ విజ్ఞప్తి మేరకు.. శేరిలింగంపల్లి మండలంలో డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ పరిశీలన చేపట్టి రెవెన్యూ రికార్డుల ప్రకారం కంచ గచ్చిబౌలి సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాలు కంచ అస్తబల్ పోరంబోకు సర్కారీ (అంటే... ప్రభుత్వ భూమి) అని నిర్ధారించారు. ఆక్రమణలకు గురికాకుండా అభివృద్ధి పనులకుగానూ ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని సూచించారు.
2022 సెప్టెంబరు 14న జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 571, రెవెన్యూ (అస్సైన్-1) డిపార్ట్ మెంట్ ప్రకారం భూ కేటాయింపులకు సంబంధించిన కొత్త విధానం ఆధారంగా కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని కొలిచి, హక్కులు బదిలీ చేసేందుకు ఐ అండ్ సీ విభాగానికి రాష్ట్ర ప్రభుత్వం 2024 జూన్ 19న బాధ్యత అప్పగించింది.
ఐటీ, ఇతర ప్రాజెక్టుల ఏర్పాటుకు తమకు ఆ 400 ఎకరాలు కేటాయించాలని టీజీఐఐసీ 2024 జూన్ 19న ప్రతిపాదనలు సమర్పించింది. ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. దీంతో కంచ గచ్చిబౌలి గ్రామ సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల ప్రభుత్వ భూమి హక్కులను టీజీఐఐసీకి బదలాయిస్తూ ప్రభుత్వ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి 2024 జూన్ 24న ఉత్తర్వులు జారీ చేశారు. శేరిలింగంపల్లి మండల రెవెన్యూ అధికారులు ఆ 400 ఎకరాల భూమికి సంబంధించి పంచనామా నిర్వహించి 2024 జులై 1న టీజీ ఐఐసీకి అప్పగించారు. అప్పటినుంచి ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వం స్వాధీనంలో ఉంది. కొన్ని మీడియాల్లో వస్తున్నట్టు ఇందులో అటవీ భూమి లేదు. రెవెన్యూ రికార్డుల్లోనూ ప్రభుత్వ భూమిగానే ఉంది.
హెచ్సీయూ అధికారుల సమక్షంలో హద్దుల గుర్తింపు
తమకు కేటాయించిన 400 ఎకరాల భూమికి సంబంధించిన ఉమ్మడి హద్దుల గుర్తింపునకు తమ అధికారులకు సహకరించాలని కోరుతూ హెచ్సీయూ రిజిస్ట్రార్కు 2024 జులై 4 న టీజీఐఐసీ సైబరాబాద్ జోనల్ మేనేజర్ కు లేఖ రాశారు. టీజీఐఐసీ అధికారులు తమ బృందంతో పాటు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్ట్రార్ను 2024 జులై 7న వ్యక్తిగతంగా కలిసి.. ప్రాజెక్ట్ ప్రతిపాదనలను ఆయనకు వివరించారు. సర్వే నిర్వహణ విషయంపై 2024 జులై 18న హెచ్సీయూ రిజిస్ట్రార్ మెయిల్ registrar@uohyd.ac.in కు టీజీఐఐసీ జోనల్ మేనేజర్ ఈ మెయిల్ చేశారు.
హెచ్సీయూ రిజిస్ట్రార్ సమ్మతితోనే 2024 జులై 19న వర్సిటీ అధికారులు, రిజిస్ట్రార్, ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్ సమక్షంలో సర్వే నిర్వహించారు. అదే రోజు హద్దులు నిర్ధారించారు. టీజీఐఐసీ అభివృద్ధి చేస్తున్న 400 ఎకరాల్లో ఎలాంటి బఫెల్లో లేక్, పీకాక్ లేక్ లేవు.
అక్కడ చేసిన సర్వేను పరిశీలించిన టీజీఐఐసీ తాము చేసే లేఅవుట్లో మష్రూమ్ రాక్స్తో పాటు ఇతర రాళ్ల అమరిక (రాక్ ఫార్మేషన్)ను హరిత స్థలాలుగా (గ్రీన్ స్పేస్) పరిరక్షించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. తర్వాత మాస్టర్ప్లాన్లో ఆ ప్రాంతంలో సుస్థిరాభివృద్ధికి సమగ్ర పర్యావరణ యాజమాన్య ప్రణాళిక (ఈఎంపీ) తయారు చేయాలని నిశ్చయించింది.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూములను టీజీఐఐసీ ఆక్రమించలేదని, ఇప్పుడు ఉన్న జల వనరులు (లేక్స్), రాళ్ల అమరిక (రాక్ ఫార్మేషన్)ను దెబ్బతీయడం లేదని స్పష్టం చేసింది. ఆ 400 ఎకరాల ప్రభుత్వ భూమిని మాస్టర్ప్లాన్ ప్రకారం సాధ్యమైనంత ఎక్కువగా వినియోగించుకునేందుకు 2025 ఫిబ్రవరి 28న టీజీఐఐసీ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ జారీ చేసింది.