రంగారెడ్డి జిల్లాలో పెళ్లి చేసుకోమని అడిగినందుకు బురదలో తొక్కి చంపిన ప్రియుడు

రంగారెడ్డి జిల్లాలో పెళ్లి చేసుకోమని అడిగినందుకు బురదలో తొక్కి చంపిన ప్రియుడు

షాద్ నగర్, వెలుగు: ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోమని అడిగినందుకు ప్లాన్ ప్రకారం ఓ యువకుడు హత్య చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో జరిగింది. షాద్ నగర్ సీఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..  మధ్యప్రదేశ్ కు చెందిన జ్యోతి సింగ్ (24) చటన్ పల్లి పరిధిలోని ప్రయాగ్ రాగ్ కంపెనీలో పని చేస్తుంది.  అదే కంపెనీలో మధ్యప్రదేశ్ కు చెందిన సంజయ్ చంద్ర డైలీ లేబర్ గా పనిచేస్తున్నాడు. 

 కొంతకాలంగాజ్యోతి సింగ్‌‌తో సంజయ్ చంద్ర ప్రేమిస్తున్నానని చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు. జ్యోతి పెళ్లిచేసుకోవాలని అడగ్గా ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.  ఈనెల 24న రాత్రి 8 గంటల సమయంలో జ్యోతికి కాల్ చేసిన సంజయ్ చటాన్ పల్లి గ్రామ శివారులోని నాట్కో కంపెనీకి వెళ్లే సీసీ రోడ్డు వద్దకు రమ్మన్నాడు.  రాత్రి 9 గంటలకు జ్యోతి అక్కడకు వెళ్లగా..  నిందితుడు పక్కనే ఉన్న వరి చేను బురదలో జ్యోతిని తొక్కి గొంతు పిసికి చంపేశాడు. 

అనంతరం రూమ్‌‌కి వెళ్లి బురద అంటిన ప్యాంట్, షర్టు రూమ్ బయట దాచిపెట్టి పారిపోయాడు. నిందితుడిని టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా పట్టుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.  సమావేశంలో ఎస్సై సుశీల, ఎస్సై శరత్ కుమార్ సిబ్బంది తదితరులున్నారు.