అది ఎన్డీయే రిపోర్ట్ .. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై ఇప్పించాయి: హరీశ్​రావు

అది ఎన్డీయే రిపోర్ట్ .. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై ఇప్పించాయి: హరీశ్​రావు
  • సీబీఐ, ఈడీలాగా ఎన్డీఎస్ఏను కేంద్రం వాడుకుంటున్నది 
  • కాళేశ్వరంలో అవినీతి జరిగినట్టు రిపోర్ట్​లో ఎక్కడా చెప్పలేదు
  • ఎన్డీఎస్​ఏ పేరుతో మంత్రి ఉత్తమ్ రాజకీయ ప్రసంగం చేశారు
  • మేడిగడ్డలో ఏడో బ్లాక్​ ఒక్కటే కుంగింది.. దాన్ని తిరిగి కట్టాలి
  • హైలెవెల్​ కమిటీలో చర్చించాకే అన్నారం, సుందిళ్ల లొకేషన్ల మార్పు 
  • అన్ని టెస్టులు, డిజైన్ల ప్రకారమే బ్యారేజీలు నిర్మించామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినట్టు నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) రిపోర్ట్​లో ఎక్కడా చెప్పలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు.  ఎన్డీఎస్​ఏ పేరుతో మంత్రి ఉత్తమ్​ కుమార్​ రాజకీయ ప్రసంగం చేశారని  మండిపడ్డారు. అసెంబ్లీ  ఎన్నికల ముందు ప్రైమరీ రిపోర్ట్​, పార్లమెంట్​ ఎన్నికలప్పుడు మధ్యంతర రిపోర్ట్​, బీఆర్ఎస్​ రజతోత్సవ సభకు ముందు తుది రిపోర్ట్​ అంటూ విడుదల చేశారని అన్నారు. అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్​ కాదని.. ఎన్డీయే రిపోర్ట్​ అని విమర్శించారు. 

సీబీఐ, ఈడీలాగానే ఎన్డీఎస్ఏను కూడా కేంద్రం రాజకీయ స్వలాభం కోసం వాడుకుంటున్నదని ఆరోపించారు. కాంగ్రెస్​, బీజేపీ కుమ్మక్కై రిపోర్టును రిలీజ్​ చేశాయని అన్నారు. మంగళవారం హరీశ్​రావు తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. ఎన్డీఎస్ఏ బిల్లును కాంగ్రెస్​ వ్యతిరేకించిందని, గతంలో ఎంపీగా ఉన్న ఉత్తమ్​ కూడా ఆ బిల్లును వ్యతిరేకించారని గుర్తుచేశారు. అప్పుడేమో రాష్ట్రాల హక్కులను కబ్జా చేయడమేనని అన్న ఉత్తమ్​కు.. ఇప్పుడు ఎన్డీఎస్​ఏ ఎలా కరెక్ట్​ అయిందని ప్రశ్నించారు. ఎన్ని చేసినా బీఆర్ఎస్​ రజతోత్సవ సభను అడ్డుకోలేకపోయారని, ఇప్పుడు ఎక్కడ చూసినా కేసీఆర్​ ప్రసంగంపైనే చర్చ నడుస్తున్నదని తెలిపారు.  

పోలవరానికి ఎందుకు పోలే?

పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నది ఎన్డీఎస్ఏనేనని, ఆ ప్రాజెక్టు డయాఫ్రం వాల్, గైడ్​ వాల్​ కుప్పకూలినా ఇప్పటిదాకా అక్కడకు ఎన్డీఎస్ఏ ఎందుకు పోలేదని హరీశ్​రావు ప్రశ్నించారు. నాలుగైదేండ్లు అయినా పోల వరంపై రిపోర్టు ఇవ్వలేదన్నారు. అసలు ఎస్ఎల్ బీసీ ప్రమాదం కన్నా పెద్ద డిజాస్టర్​ ఇంకా ఏముంటుందని ప్రశ్నించారు. ప్రమాదం జరిగి 60 రోజులు అవుతున్నా.. అందులో చిక్కుకున్నవారి జాడను కనుక్కోలేకపోయారని, ఇంతకన్నా ఫెయిల్యూర్​ ఏముంటుందని నిలదీశారు. 

తుమ్మిడిహెట్టి విషయంలో తప్పు చేసిందే కాంగ్రెస్ అని​ అన్నారు. వైఎస్​ హయాంలో 2008లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, సర్వే మొబిలైజేషన్​ పేరిట రూ.1,426 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చారని చెప్పారు. ఇది కాంగ్రెస్​ ప్రభుత్వ అవినీతికి పరాకాష్ట అని పేర్కొన్నారు. ఆనాడు కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని, ఆనాడు మంత్రిగా ఉన్న ఉత్తమ్​ కూడా ఆ దోపిడీలో భాగమయ్యారని ఆరోపించారు. 

తప్పును సరిచేసినం

నాడు కాంగ్రెస్​ చేసిన తప్పును తమ బీఆర్ఎస్​ ప్రభుత్వం సరిచేసిందని హరీశ్​ తెలిపారు. తుమ్మిడిహెట్టి విషయంలో నాడు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్​తో చర్చలు జరిపామని, స్వయంగా కేసీఆర్ వెళ్లారని చెప్పారు. మహారాష్ట్ర ఇరిగేషన్​ శాఖ మంత్రిగా ఉన్న ముషారఫ్​తో తాను చర్చలు జరిపానని తెలిపారు.  ఎంత డబ్బైనా ఇస్తాం..తుమ్మిడిహెట్టి వద్ద అనుమతి ఇవ్వాలని కోరినా ఒప్పుకోలేదన్నారు. 

ఉత్తమ్​ అజ్ఞానంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తుమ్మిడిహెట్టి వద్ద 160 టీఎంసీల నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ క్లియర్​గా చెప్పిందని గుర్తు చేశారు. కేంద్రం నీళ్లు లేవని చెప్పడంతోనే మేడిగడ్డ వద్దకు బ్యారేజీని మార్చామని తెలిపారు. మేడిగడ్డ డీపీఆర్​ను 4 నెలల్లోనే తయారు చేశామంటున్నారని.. కానీ, కొడంగల్–​ నారాయణపేట లిఫ్ట్​కు ఇప్పటివరకు డీపీఆర్​ ఉందా? అని ప్రశ్నించారు. 

డీపీఆర్​ లేకుండానే టెండర్లను ఎలా పిలిచారని ప్రశ్నించారు. ఆర్ఈసీ దగ్గర అప్పు తెచ్చామంటున్నారని.. కానీ, కాంగ్రెస్​లాగా రూ.170 కోట్లు బ్రోకర్​కు లంచం ఇచ్చి అప్పులు తీసుకురాలేదని అన్నారు. బ్రోకర్​కు పైసలిచ్చి హెచ్​సీయూ భూములను తాకట్టుపెట్టి రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చారని ఆరోపించారు. 

అన్నారం, సుందిళ్ల లొకేషన్​ మారింది నిజమే..

అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లొకేషన్లను మార్చింది నిజమేనని హరీశ్​ రావు తెలిపారు. హైలెవెల్​ కమిటీ నిర్ణయం మేరకే అన్నారం, సుందిళ్ల లొకేషన్లను మారుస్తూ ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​ నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. అన్నిరకాల టెస్టులు చేశాకే, డిజైన్ల ఆధారంగానే బ్యారేజీలను నిర్మించామని వెల్లడించారు. మేడిగడ్డ ఫీజిబుల్​ కాదంటూ ఫైవ్​మెన్​ కమిటీ రిపోర్టు చెప్పలేదని, మేడిగడ్డ నుంచి మిడ్​మానేరుకు డైరెక్ట్​ లిఫ్ట్​ సాధ్యం కాదని మాత్రమే చెప్పిందని అన్నారు. 

అందుకే అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు లిఫ్ట్​ చేశామన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో ఒక్క ఏడో బ్లాక్​ తప్ప.. మిగతా అంతా బాగానే ఉందన్నారు. ఆ బ్లాక్​ను తొలగించి కొత్తగా నిర్మిస్తే దానిని వాడుకోవచ్చంటూ ఎన్డీఎస్ఏనే చెప్పిందన్నారు. చేతనైతే త్వరగా రిపేర్లు చేసి మేడిగడ్డను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్​ చేశారు. బ్యారేజీల్లో 2 టీఎంసీలకు మించి స్టోర్​ చేయొద్దంటూ ఉత్తమ్​ చెబుతున్నారని, కానీ, గంగా నదిపై నిర్మించిన ఫరక్కా బ్యారేజ్​ను 30 టీఎంసీల స్టోరేజీ​తో నిర్మించారని చెప్పారు. 

దాని డెడ్​స్టోరేజ్​ అంత కూడా మన బ్యారేజీల స్టోరేజ్​ లేదని పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ చైర్మన్​ చంద్ర శేఖర్​ అయ్యర్.. పోలవరం అథారిటీ చైర్మన్​గా ఆ ప్రాజె క్టును నిర్మిస్తే అది కుప్పకూలిందని ఆరోపించారు.