
భూఉపరితలంపై 71శాతం జలభాగం విస్తరించి ఉంది. దీనిని 5 మహాసముద్రాలుగా విభజించారు. వీటి పరిధిలో 177 దేశాలు వాటి తీర ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. సైక్లోన్లను అల్ప పీడన ద్రోణి లేదా వాయుగుండంగా పిలుస్తారు. ఇవి 98 శాతం సముద్రాల మీద నుంచి 2 శాతం భూ ఉపరితలం నుంచి ప్రయాణిస్తాయి. సైక్లోన్ అనే పదాన్ని 1948లో తొలిసారిగా హెన్రి పెడంగ్ టన్ అనే వాతావరణ శాస్త్రవేత్త ఉపయోగించారు. సైక్లోన్ గ్రీకు భాషలోని ‘కైక్లొన్’ అనే పదం నుంచి వచ్చింది. దీనికి ‘తిరుగుతున్న నీరు(రివాల్వింగ్ వాటర్) లేదా చుట్టుకున్న పాము అని అర్థం.
ప్రపంచంలో పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాలలో, అంతర్జాతీయ దినరేఖకు పశ్చిమంగా ఉన్న ప్రాంతంలో మిగిలిన అన్ని ప్రాంతాల కంటే అధికంగా తుపాన్లు ఏర్పడుతాయి. దక్షిణ అట్లాంటిక్ ప్రాంతం, దక్షిణ అమెరికా తీర ప్రాంతాలలో తుపాన్లు సంభవించవని శాస్త్రవేత్తలు భావిస్తూ ఉండేవారు. దీనికి విరుద్ధంగా 2004 మార్చి 26న ‘కత్రినా’ దక్షిణ అట్లాంటిక్లో సంభవించి చరిత్ర సృష్టించింది. ఐక్యరాజ్యసమితి విపత్తు ప్రకారం 1994–2013 మధ్య ప్రపంచంలో రెండో అత్యధికంగా సుమారు 2 లక్షల 44 వేల మంది మరణించారు. ప్రపంచంలో ప్రతి సంవత్సరం సగటున 97 తుపాన్లు సంభవిస్తున్నాయి. వీటి ఉద్ధృ తి మే–నవంబర్ నెల మధ్యలో ఉంటుంది. వీటి తీవ్రతను బట్టి వివిధ దేశాలలో వివిధ పేర్లతో పిలుస్తారు.
మెక్సికో, కరేబియన్, వెస్టిండీస్ | హరికేన్స్ |
చైనా, జపాన్, పిలిఫ్ఫైన్స్ | టైపూన్స్ |
అమెరికా, అట్లాంటిక్ | టోర్నడో |
ఆస్ట్రేలియా | విల్లీ విల్లీ |
ఇండియా, హిందూ
మహాసముద్రం |
తుపాన్లు |
ఇండోనేషియా | బాగ్నోస్ |
అంటార్కిటికా | బ్లిజార్డ్స్ |
ఇండియాకు మూడు వైపులా సముద్రం ఉండడంతో 7516 కిలోమీటర్ల తీరరేఖ కలిగి ఉంది. దేశ భౌగోళిక వైశాల్యంలో ప్రధాన తీర ప్రాంత భూభాగం 5400 కిలోమీటర్లు, అండమాన్ నికోబార్ దీవులు 1900 కిలోమీటర్లు, లక్షదీవుల్లో 132 కిలోమీటర్లు తుపాన్ తీవ్రత ఉంది. మన దేశంలో సగటున ప్రతి సంవత్సరం 6 తుపాన్లు వస్తాయి. వీటి తీవ్రత మే–జూన్, అక్టోబర్–నవంబర్ మధ్య ఉంటుంది. బంగాళాఖాతంలో 4 తుపాన్లు సంభవిస్తే, అరేబియా సముద్రంలో ఒకటి సంభవిస్తుంది. ప్రధానంగా బంగాళాఖాతంలో తమిళనాడు, ఏపీ, ఒడిశా, వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి తూర్పు తీరంలో, అరేబియా సముద్రంలో గుజరాత్ ఎక్కువ తుపాన్లు ఎదుర్కొంటాయి. తుపాన్ వచ్చినప్పుడు సముద్ర తరంగం 6 మీటర్ల ఎత్తుకు లేస్తుంది. వీటిని పసిగట్టడానికి టైడ్ గేజ్ నెట్వర్క్ లేదా రాడార్లను ఉపయోగిస్తారు.
తెలంగాణలో సముద్రం లేకపోయినప్పటికీ బంగాళాఖాత అల్పపీడన ద్రోణులతో ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు పాక్షిక తుపాన్ ప్రభావం ఉంటుంది. ఏపీలో 44శాతం ఉష్ణ మండల తుపాన్లకు, దానికి సంబంధించిన వైపరీత్యాలకు గురవుతున్నది. పదే పదే తుపాన్లు వచ్చి ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవిస్తుండడంతో కోస్తా రాష్ట్రాల్లోనూ, కేంద్రపాలిత ప్రాంతాల్లో తుపాను ప్రమాద ఉపశమనానికి నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్టును కేంద్రం ప్రారంభించింది. తుపాను ముందస్తు అంచనా పర్యవేక్షణ, హెచ్చరిక వ్యవస్థను మరింత సమర్థవంతంగా చేయడం, తుపాను ప్రభావిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తీర ప్రాంత ప్రజల సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం, విపత్తు నిర్వహణ కార్యక్రమాలను చేపట్టడం కోసం హోం మంత్రిత్వశాఖ ప్రారంభించింది. దీనిని 2006లో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి బదిలీ చేసింది. ఇదికాకుండా దేశంలో సమగ్రమైన తీరప్రాంత నిర్వహణను ఆచరణలో పెట్టేందుకు సమీకృత తీర ప్రాంత మండల నిర్వహణ ప్రాజెక్టును తీసుకొచ్చింది.
1945 నుంచి..
ప్రపంచవ్యాప్తంగా తుపాన్లకు పేర్లు పెట్టే విధానం రెండో ప్రపంచయుద్ధ కాలం నుంచి ప్రారంభమైంది. తొలిసారి కరేబియన్ ఐలాండ్స్లో నివసించే ప్రజలు తుపాన్లకు పేర్లు పెట్టి పిలిచారు. కానీ ఇవి పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. అధికారికంగా మాత్రం 1945లో పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన తుపానుకు పేరు పెట్టడంతో మొదలైంది. అమెరికాకు చెందిన నేషనల్ హరికేన్ సెంటర్ తుపాన్ల నామకరణాన్ని మొదలుపెట్టింది. దీనికోసం ఇంగ్లిష్ లెటర్స్ మాత్రమే వాడతారు. ఒక ఏడాదిలో ఏర్పడే తుపాన్లకు A అక్షరం వచ్చేలా, తర్వాతి సంవత్సరం B వచ్చేలా ఇలా W వరకు వరుసగా ఉపయోగిస్తారు. ఇందులో Q, Uలను మినహాయిస్తారు.
- ఒక సంవత్సరంలో ఒకటి కన్నా ఎక్కువ తుపాన్లు వచ్చినా లేదా వీటిపై తదనంతర కాలంలో అధ్యయనం చేయాలన్నా అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా కన్నా పేర్ల ఆధారంగా అధ్యయనం చేయడం సులభమని భావించిన హిందూ మహాసముద్ర దేశాలు 8 కలిసి 2004లో ఒక జాబితా రూపొందించుకుని పేర్లు పెట్టడం ప్రారంభించాయి.
- 2000 ఫిబ్రవరి 29 నుంచి మార్చి 6 వరకు జరిగిన వరల్డ్ మెటిరియోలాజికల్ ఆర్గనైజేషన్, ఎకనామిక్స్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ సంయుక్తంగా నిర్వహించిన 27వ సదస్సులో హిందూ మహా సముద్ర ప్రాంతంలోని 8 భాగస్వామ్య దేశాలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఇది 2004 మే నాటికి పూర్తవగా సెప్టెంబర్లో హిందూ మహా సముద్రంలో సంభవించిన తుపానుకు తొలిసారిగా ఓనిల్ అని పేరు పెట్టారు. దీనిని బంగ్లాదేశ్ సూచించింది. రెండో తుపానుకు ఇండియా సూచించిన అగ్ని అని పేరు పెట్టారు.
- హిందూ మహాసముద్ర ప్రాంతంలో ముఖ్యంగా ఇండియాను ఆనుకుని ఉన్న బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడే తుపాన్లకు పేర్లు పెడుతున్నారు. అన్ని తుపాన్లకు కాకుండా కేవలం 34 నాట్స్ మించి గాలుల వేగం ఉంటే అటువంటి తుపాన్లకు మాత్రమే ప్రత్యేకమైన పేర్లు పెడతారు.
- హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుపాన్లకు ఇంగ్లిష్ లెటర్స్ ఆధారంగా మొదటి తుపానుకు జాబితాలోని మొదటి దేశం పేరు పెడుతుంది. తర్వాత వచ్చే తుపాన్లకు ఇంగ్లిష్ లెటర్స్లోని తర్వాతి దేశాలు పేర్లు పెడతాయి. ఇండియాలో ఈ పేర్లను భారత వాతావరణ విభాగం నిర్ణయిస్తుంది.
- ఒక్కో దేశం 8 పేర్లను సూచిస్తుంది. ఇప్పటివరకు 8 దేశాలు రూపొందించిన రెండు జాబితాలు పూర్తయ్యాయి. తొలి తుపాన్ ఒనిల్ కాగా చివరిది అంఫన్.
టైపు వేగం (కి.మీ/గంట)
అల్పపీడన ద్రోణి 31
వాయుగుం డం 31–49
తీవ్ర వాయుగుం డం 50–61
తుపాన్ 62–88
తీవ్ర తుపాన్ 89–118
అత్యం త తీవ్ర తుపాన్ 119–221
సూపర్ సైక్లోన్ 221 కన్నా ఎక్కువ
పేర్లు పెట్టే దేశాలివే..
బంగ్లాదేశ్ ఇండియా
మాల్దీవులు మయన్మార్
ఒమన్ పాకిస్థాన్
శ్రీలంక థాయ్లాండ్
ఇరాన్ ఖతార్
సౌదీ అరేబియా యెమన్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
ఇప్పుడు 8 దేశాలకు తోడు ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యెమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరడంతో మొత్తం దేశాల సంఖ్య 13కు చేరింది. 2018 సెప్టెంబర్లో ఒమన్లో జరిగిన 45వ సెషన్లో ఒక్కో దేశం 13 పేర్లు సూచించాలని నిర్ణయించారు. దీంతో మొత్తం 169 పేర్లను పెట్టాలి. 2019 సెప్టెంబర్ 13న మయన్మార్ రాజధాని న్యెపిటాలో జరిగిన 46వ సెషన్లో పేర్లను పరిశీలించి 2020 ఏప్రిల్లో అధికారికంగా ప్రకటించారు.
హుద్హుద్, తిత్లీ..
2016లో బంగాళాఖాతంలో సంభవించిన తుపానుకు మాల్దీవులు రోను అని పేరు పెట్టింది. అదే ఏడాది అండమాన్, చెన్నై, కర్ణాటక, గోవాలో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో సంభవించిన తుపానుకు పాకిస్థాన్ వార్థా అని పేరు పెట్టింది. వార్థా అంటే ‘ఎర్ర గులాబి’ అని అర్థం. 2014లో విశాఖపట్నాన్ని అతలాకుతలం చేసిన తుపానుకు ఒమన్ హుద్హుద్ అని పేరు పెట్టింది. ఇది ఇజ్రాయెల్ దేశంలోని ఒక పక్షి పేరు. తిత్లీ తుపాన్ పేరును పాకిస్థాన్, గజ పేరును శ్రీలంక సూచించాయి.
తర్వాతి పేర్లు ఇవే..
ఇటీవల సంభవించిన తుపానుకు ‘అంఫన్’ అని థాయ్లాండ్ పేరు పెట్టింది. అంఫన్ అంటే థాయ్ భాషలో ఆకాశం అని అర్థం. ఈ నెలలో అరేబియా సముద్రంలో వచ్చిన తుపానుకు నిసర్గ్ అని పెట్టారు. దీనిని బంగ్లాదేశ్ సూచించింది. దీనికి అర్థం ప్రకృతి. తర్వాత రాబోయే తుపాన్లకు సంబంధించిన పేర్లు, వాటికి సూచించిన దేశాలను వరుసగా పరిశీలిస్తే గతి (ఇండియా), నివార్(ఇరాన్), బురేవి(మాల్దీవులు), టేట్కీ(మయన్మార్), యాస్(ఒమన్), గులాబ్(పాకిస్థాన్), షహీన్(ఖతార్), జవాద్(సౌదీ అరేబియా), అసాని(శ్రీలంక), సిత్రంగ్(థాయ్లాండ్), మాండస్(యూఏఈ), మోచా(యెమన్). వీటి పేర్లు 8 లెటర్స్ మాత్రమే ఉండాలి. ఎవరి మనోభావాలను దెబ్బతీయకుండా ఉండేవాటినే తీసుకుంటారు.
– ఎస్ మహిపాల్ రెడ్డి, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్