
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో రెండు సెమీ ఫైనల్ మ్యాచుల్లో తలపడబోయే జట్లు ఏవో క్లారిటీ వచ్చేసింది. మార్చి 4న జరగబోతున్న తొలి సెమీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య కీలక సమరం. వేదిక దుబాయ్ స్టేడియం. ఆస్ట్రేలియాకు కీలక బౌలర్లు దూరం కావడం ఆ జట్టును కంగారు పెడుతోంది. స్టార్క్, కమిన్స్, హేజల్ వుడ్.. ఈ ముగ్గురూ ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో లేరు. ఈ ముగ్గురూ ఎలాంటి బౌలర్లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. కమిన్స్ అయితే ఆల్ రౌండ్ షోతో ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారే క్రికెటర్.
ఈ ముగ్గురూ లేకుండానే ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్లో టీమిండియాతో తలపడే అవకాశం ఉంది. గాయం కారణంగా ట్రావిస్ హెడ్ కూడా సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆడకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ అంశాలన్నీ కంగూరూ జట్టును కంగారు పెడుతున్నాయి. సెకండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ మార్చి 5న న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతుంది. ఈ సెమీ ఫైనల్ మ్యాచుల్లో ప్రత్యర్థులను ఓడించిన రెండు జట్లు మార్చి 9న ఆదివారం రోజున జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో చావోరేవో తేల్చుకోనున్నాయి.
The 2025 Champions Trophy semi-finals are set 🍿 pic.twitter.com/Vj949ONnMv
— ESPNcricinfo (@ESPNcricinfo) March 2, 2025
ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా జట్టు ఆడిన మూడు మ్యాచుల్లో ప్రత్యర్థి జట్లను ఓడించి గ్రూప్ ‘ఏ’ పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉంది. గ్రూప్ ‘బీ’లో దక్షిణాఫ్రికా జట్టు 3 మ్యాచుల్లో 2 గెలిచి టాప్లో ఉంది. గ్రూప్ ‘ఏ’ లో టాప్లో ఉన్న జట్టు(టీమిండియా) గ్రూప్ ‘బీ’ లో రెండో స్థానంలో ఉన్న జట్టుతో(ఆస్ట్రేలియా) సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ ‘బీ’లో టాప్లో ఉన్న జట్టు(సౌతాఫ్రికా) గ్రూప్ ‘ఏ’లో రెండో స్థానంలో ఉన్న జట్టుతో(న్యూజిలాండ్) సెమీస్లో తలపడుతుంది.
భారీ వర్షం కారణంగా చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్ మధ్య జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో గ్రూప్–బిలో నాలుగు పాయింట్లు సాధించిన కంగారూలు సెమీస్ బెర్త్ను ఖాయం చేసుకున్నారు. టాస్ నెగ్గిన అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 273 రన్స్కు ఆలౌటైంది. సెదిఖుల్లా అటల్ (95 బాల్స్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 85), అజ్మతుల్లా ఒమర్జాయ్ (63 బాల్స్లో 1 ఫోర్, 5 సిక్స్లతో 67) రాణించారు. తర్వాత ఆసీస్ 12.5 ఓవర్లలో 109/1 స్కోరు చేసింది. ఈ దశలో వాన వల్ల మ్యాచ్కు అంతరాయం కలిగింది. మధ్యలో కాస్త తెరిపి ఇచ్చినా ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో ఆట సాధ్యం కాలేదు. దీంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన అంపైర్లు ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.
ఇక.. ఇవాళ(మార్చి 2, 2025) న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. కివీస్ చేతిలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 249 పరుగులు చేసింది. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 205 పరుగులకే ఆలౌట్ అయి ఓటమిని మూటగట్టుకుంది. ఒక్క విలియమ్ సన్(81) మినహాయిస్తే మిగిలిన కివీస్ బ్యాట్స్మెన్స్ ఎవరూ టీమిండియా బౌలర్లను ఎదుర్కోలేకపోయారు. భారత బౌలర్ల ధాటికి కివీస్ చేతులెత్తేసింది. టీమిండియా బౌలర్ వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో కివీస్ ఓటమిలో, టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు.