హెచ్ఎండీఏ మాస్టర్​ప్లాన్ ట్రిపుల్ఆర్ దాకా..

హెచ్ఎండీఏ మాస్టర్​ప్లాన్ ట్రిపుల్ఆర్ దాకా..
  • 2050 నాటి అవసరాలకు తగ్గట్టు రూపకల్పన
  • ప్రస్తుత ప్లాన్​లో మార్పులు, చేర్పులు  
  • 7,285 చ.కి.మీ.కు మరో 5 వేల చ.కి.మీ పెరిగే ఛాన్స్ 
  • మరో రెండు, మూడు జిల్లాలకు హెచ్ఎండీఏ పరిధి పెరిగే అవకాశం

హైదరాబాద్, వెలుగు :  ఓఆర్ఆర్​పరిసర ప్రాంతాలను గ్రేటర్​లో విలీనం చేస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయగా, ఎక్స్​టెండెడ్​మాస్టర్​ప్లాన్​లోనూ మార్పులు చేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. బల్దియా పరిధి విస్తరిస్తున్న నేపథ్యంలో హెచ్ఎండీఏ పరిధిని పెంచాలని చూస్తోంది. ఈ క్రమంలో మాస్టర్​ప్లాన్​ను మరింత విస్తరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఓఆర్ఆర్ కు అవతల నిర్మిస్తున్న రీజినల్​రింగ్​రోడ్(ట్రిపుల్​ఆర్)వరకూ హెచ్ఎండీఏ విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది.

2030 కాదు 2050

ప్రస్తుతం హెచ్​ఎండీఏ పరిధి 7,285 చదరపు కిలోమీటర్లు. రీజినల్ ​రింగ్ రోడ్​ వరకూ పొడిగిస్తే మరో 5 వేల చదరపు కిలోమీటర్లు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అందుకు అనుగుణంగా మాస్టర్​ప్లాన్​రూపొందించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఏడు జిల్లాల్లో హెచ్ఎండీఏ పరిధి కొనసాగుతోంది. ట్రిపుల్​ఆర్​వరకు పొడిగిస్తే మరో రెండు లేదా మూడు జిల్లాలు హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. రీజినల్ ​రింగ్ ​రోడ్​ నిర్మాణం పూర్తయ్యేలోగా హెచ్​ఎండీఏ పరిధిని పెంచే ప్రక్రియ కూడా పూర్తి చేయాలని, అందులో భాగంగా మాస్టర్​ ప్లాన్​లో మార్పులు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న మాస్టర్​ప్లాన్​2030 సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించగా ట్రిపుల్ఆర్​వరకూ రూపొందించే మాస్టర్​ప్లాన్​ను 2050 సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నారు. ఓఆర్​ఆర్​ నుంచి ట్రిపుల్​ఆర్​ వరకూ ఉన్న ప్రాంతాలన్నీ హెచ్​ఎండీఏ పరిధిలోకి తీసుకొచ్చి రెండు రింగ్​రోడ్లను అనుసంధానం చేస్తూ రేడియల్​ రోడ్లను నిర్మించాలన్నది ప్రభుత్వ ప్రతిపాదనగా అధికారులు తెలిపారు. 

మూడు క్లస్టర్లుగా...

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రీజినల్​ రింగ్ రోడ్ తో తెలంగాణ స్వరూపమే మారిపోనుంది. ముఖ్యంగా తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఓఆర్​ఆర్ ​లోపల అర్బన్​ క్లస్టర్​, ఓఆర్​ఆర్​ తర్వాత ట్రిపుల్​ఆర్​వరకు సెమీ అర్బన్​ క్లస్టర్, దాని అవతలి ప్రాంతాన్ని రూరల్​ క్లస్టర్​గా అభివృద్ధి చేస్తారు. అంటే ట్రిపుల్​ఆర్​వరకూ హెచ్​ఎండీఏను విస్తరించిన తర్వాత దానికి తగ్గట్టు మాస్టర్​ ప్లాన్​ రూపొందించాలని నిర్ణయించారు. ప్రస్తుతం హెచ్​ఎండీఏ పరిధిలో ఉన్న ఐదు మాస్టర్ ​ప్లాన్​లు హుడా, హడా, సీడీఏ, జీహెచ్ఎంసీ, ఎక్స్​టెండెడ్​ ఏరియా మాస్టర్​ ప్లాన్లలో మరిన్ని మార్పులు చేసేందుకు హెచ్ఎండీఏ సిద్ధమవుతోంది. 

వీటన్నింటినీ రద్దుచేసి ట్రిపుల్ ఆర్​ వరకూ ఒకే మాస్టర్​ ప్లాన్​  ‘మెగా హెచ్​ఎండీఏ మాస్టర్​ప్లాన్​-2050’ రూపొందించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన కార్యక్రమాలను హెచ్​ఎండీఏ రూపొందిస్తుందని ఓ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ముఖ్యంగా ఈ మెగా మాస్టర్​ ప్లాన్​ను ఆయా ప్రాంతాలను బట్టి వివిధ కేటగిరీల కింద మార్పు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఇందులో వివిధ జోన్​లను ఏర్పాటు చేయనున్నారు. 2050 నాటికి  ఆయా ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి జరగాలన్నదానిపై మాస్టర్​ ప్లాన్​లో రూపొందించనున్నారు. ఇందులో రెసిడెన్షియల్​, కమర్షియల్​, ఇండస్ట్రియల్​, ఐటీ, గ్రీనరీ, ఎంటర్​టెయిన్​మెంట్​ జోన్స్​, అగ్రికల్చర్​ జోన్​, కన్జర్వేషన్​ జోన్​ ఇలాంటి వివిధ రకాల అవసరాలకు తగ్గట్టుగా జోన్​లను విభజించి మాస్టర్ ప్లాన్​ రూపొందించనున్నట్టు అధికారులు వెల్లడించారు. రాబోయే కాలంలో నాలుగైదు మాస్టర్​ప్లాన్​లు కాకుండా ఒకే మాస్టర్​ ప్లాన్​ అమలు చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించనున్నట్టు తెలిపారు