సింగరేణి పీఏడబ్య్లూ డైరెక్టర్‎పై వేటుకు సిద్ధం..!

సింగరేణి  పీఏడబ్య్లూ డైరెక్టర్‎పై వేటుకు సిద్ధం..!

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణి కాలరీస్​ కంపెనీ ఆపరేషన్స్, పర్సనల్ అండ్​ వెల్ఫేర్( పా(పీఏడబ్య్లూ) అదనపు బాధ్యతలు) డైరెక్టర్ శ్రీనివాస్‎పై​వేటుకు యాజమాన్యం రెడీ అయినట్టు తెలిసింది. ఆయన బాధ్యతలను డైరెక్టర్​ప్రాజెక్ట్​ అండ్ ​ప్లానింగ్​ వెంకటేశ్వరరెడ్డికి, డైరెక్టర్ ​ఆపరేషన్స్ ​బాధ్యతలను డైరెక్టర్​ డి. సత్యనారాయణకు అప్పగిస్తూ యాజమాన్యం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో డైరెక్టర్​ శ్రీనివాస్​ను తొలిగిస్తారనే చర్చ కొత్తగూడెంలోని హెడ్డాఫీస్​లో నడుస్తోంది. 

 పీఏడబ్య్లూ డైరెక్టర్ కంపెనీలో కీలకమైనది. తొమ్మిది నెలల కిందనే ఆయన బాధ్యతలు చేపట్టారు. అయితే.. ఇటీవల శ్రీనివాస్ పై రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎండీకి ఫిర్యాదులు వెళ్లాయి. ప్రభుత్వంలోని కీలక శాఖ మంత్రితో పాటు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా  డైరెక్టర్ ​శ్రీనివాస్​ పనితీరు బాగోలేదంటూ సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా రెండు యూనియన్ల నేతలు కూడా ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది. 

కాగా.. అడ్రియాల లాంగ్​వాల్ ​ప్రాజెక్ట్​లో శ్రీనివాస్ జీఎంగా ఉన్నప్పుడే పలు అవినీతి ఆరోపణలు రావడంతో సింగరేణివ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నెల 15న కొలంబియాలో ప్రపంచ రెస్క్యూ పోటీల్లో సింగరేణి జట్టు పాల్గొననుండగా, టీమ్‎తో  వెళ్లాల్సిందిగా యాజమాన్యం ఆయనకు సూచించింది. దీంతో  పొమ్మన లేక పొగ పెట్టిందనే చర్చ  సాగుతోంది. 

గత పా డైరెక్టర్ ​దత్తాత్రేయులుపై అవినీతి ఆరోపణల కారణంగా సంస్థ టెర్మినేట్​చేసింది.  ఇలాగే మరో డైరెక్టర్​ రాజారాంను కూడా  తప్పించిన దాఖలాలున్నాయి.  ప్రస్తుత డైరెక్టర్​ శ్రీనివాస్​ను కూడా టర్మినేట్​ చేసేందుకు విజిలెన్స్​ ద్వారా సమాచారం  సేకరిస్తున్నట్టుగా కంపెనీలో ఆఫీసర్లు చర్చించుకుంటున్నారు. ప్రధానంగా పొలిటికల్​ప్రెజర్, ఆయన పనితీరు, గత అవినీతి ఆరోపణల నేపథ్యంలో ​పదవి నుంచి తొలగించే చాన్స్ ఎక్కువగా ఉందని హెడ్డాఫీస్​లోని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.