
- హైదరాబాద్లో బతకాలంటే నెలకు 31 వేలు కావాలి
- సింగిల్ రూమ్ కావాలన్నా రూ.8 వేలు పెట్టాల్సిందే
- ఇంటి కిరాయిలు, సామన్లు, రవాణా ఖర్చులకే జీతం ఖతం
- నెలకు స్కూల్ఫీజులు, వైద్య ఖర్చులు అదనం
- రూ.15 వేల జీతానికి పని చేస్తున్న లక్షల మంది
- ఇన్ఫోమెన్స్సంస్థ సర్వే రిపోర్ట్లో వెల్లడి
- లివింగ్కాస్ట్లో ఆరో స్థానంలో హైదరాబాద్
- మొదటి స్థానంలో బెంగళూరు, చివరి స్థానంలో జైపూర్
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ మహా నగరంలో లివింగ్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతున్నది. సింగిల్ రూమ్ కావాలంటే రూ. 8 వేలు పెట్టాల్సిందే. నెలకు గ్రాసరీ, స్కూల్ ఫీజులు, వైద్య ఖర్చులు అదనం. మొత్తంగా ఇక్కడ బతకాలంటే ప్రతి మనిషికి ప్రతి నెలా రూ. 31 వేల 253 అవసరమవుతున్నాయి. ఇన్ఫోమెన్స్ఆన్లైన్ మీడియా స్టార్టప్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ సర్వే రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశంలోని ఎంపిక చేసిన 10 ప్రధాన నగరాల్లో ఈ సర్వే చేయగా.. లివింగ్ కాస్ట్లో హైదరాబాద్ ఆరో స్థానంలో నిలిచింది. రూ. 35 వేల 887తో ముంబై ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. రూ. 27 వేల 813 తో అతి తక్కువ లివింగ్కాస్ట్ కలిగిన నగరంగా జైపూర్- నిలిచింది.
జీతానికి మించిన ఖర్చులు..
హైదరాబాద్నగరంలో లక్షల మంది జీతం రూ.15 వేలకు మించడం లేదు. ఒక ఫ్యామిలీ ఖర్చు సగటున రూ. 30 వేల నుంచి రూ.50 వేల వరకు అవుతున్నది. ఇందులో ప్రధానంగా ఇంటి కిరాయిలు, రవాణా ఖర్చులు, నిత్యావసర ధరలు, అదనపు ఖర్చులు కలిపి 31 వేలకు పైనే అవుతున్నది. పిల్లల స్కూల్ఫీజులు, వైద్యం ఖర్చులు వీటికి అదనం. ఇక సినిమాల లాంటి సరదాల గురించి సగటు వేతనజీవులు ఎప్పుడో మర్చిపోయారు.
ఒకరు థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలంటే కనీసం రూ.150 పెట్టాల్సి వస్తున్నది. నలుగురు వెళ్లాలంటే టికెట్లకే రూ.600 అవుతున్నది. దీంతో ఎలాంటి లగ్జరీలకు పోకుండా చాలామంది సాధారణ జీవితమే గడుపుతున్నారు. అయినా, అప్పుల చేయాల్సిన పరిస్థితి ఉన్నది. దీంతో ఫ్యామిలీలో అందరూ పని చేస్తున్నా గట్టెక్కలేకపోతున్నారు.
కనీస వేతన చట్టం ప్రకారం మన దేశంలో నైపుణ్యం లేని కార్మికులకు నెలకు రూ.17,494, నైపుణ్యం ఉన్న కార్మికులకు రూ. 21,215 చెల్లించాలని ఉన్నా.. ఎక్కడా అమలు కావడం లేదు. చట్టం అమలు కాకపోవడంతో ప్రైవేట్రంగంలో పని చేస్తున్నవారు చాలీచాలని జీతాలతో అప్పులు చేస్తూ .. కుటుంబాన్ని నెట్టుకు రావాల్సి వస్తున్నది. ఖర్చులు పెరిగినట్టుగా ఆదాయం పెరగకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ఉద్యోగుల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారయ్యింది. ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్ల సంగతి దేవుడెరుగు జాబ్ ఎక్కడా పీకేస్తారో అనే భయంతోనే బతకాల్సి వస్తున్నది.
ఇంటి కిరాయికే సగం జీతం
మరోవైపు నగరంలో ఇంటి కిరాయిల మోత మోగుతున్నది. నగరంలో సింగిల్ బెడ్రూమ్ కావాలంటే ఎంత వెనకబడిన ప్రాంతమైనా రూ. 6 వేలకు తక్కువకు దొరకడం లేదు. కొంచెం మంచిగా ఉన్న బస్తీ అయితే రూ. 15 వేలు ఉంటున్నది. పోష్ఏరియా అయితే, తక్కువలో తక్కువ రూ. 15 వేలకు పైనే పెట్టాల్సి వస్తున్నది. ఇక డబుల్బెడ్రూం సంగతి అయితే చాలామంది మర్చేపోయారు. దీంతో నలుగురు ఉన్న ఫ్యామిలీ కూడా సింగిల్బెడ్రూం, సింగిల్రూమ్లలోనే అడ్జస్ట్అవుతున్నారు.
కరోనా టైమ్లో అందరూ నగరం వదిలిపోవడంతో ఇంటి అద్దెలను భారీగా తగ్గించి, టులెట్ బోర్డులు పెట్టిన ఓనర్లు తర్వాత ఏడాదికేడాది అద్దెలను విపరీతంగా పెంచారు. నగరంలో ఐటీ కంపెనీలు, వివిధ రకాల పరిశ్రమలు, గవర్నమెంట్ ఆఫీసులు, హాస్పిటల్స్ ఉన్న ఏరియాల్లో ఇల్లు అద్దెకు తీసుకోవడం సగటు వేతనజీవికి తలకుమించిన భారం అయిపోయింది. దీంతో చాలామంది స్లమ్స్, మమూలు ప్రాంతాలకు వెళ్లి అక్కడే తక్కువకు అద్దెకు తీసుకుని బతుకులీడుస్తున్నారు.
ఈ ప్రాంతాల్లో కిరాయి అధికం
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ, ఐటీ ఏరియాలైన గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో రూ.25 వేల నుంచి ఇంటి కిరాయిలు మొదలవుతున్నాయి. ఐటీ ప్రాంతాలైన గచ్చిబౌలి, హైటెక్సిటీ ప్రాంతాల్లో ఇండ్ల కిరాయి విపరీతంగా ఉందని ప్రముఖ స్థిరాస్తి కన్సల్టింగ్ సంస్థ అనరాక్ తన తాజా నివేదికలోనూ వెల్లడించింది.
గచ్చిబౌలి, హైటెక్సిటీ ప్రాంతాల్లో చూస్తే 2021 నుంచి 2024 మధ్యనే ఇంటి కిరాయిలు 54 శాతం నుంచి 62 శాతం వరకు పెరిగాయని తేలింది. ఈ ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ రెంట్మినిమమ్రూ.25వేలు కాగా.. మ్యాగ్జిమమ్రూ.35 వేల వరకు ఉంది.