
హసన్ పర్తి, వెలుగు: కెనాల్లో ఈత కొట్టేందుకు వెళ్లి అన్నదమ్ములు గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా పలివెల్పుల అనుబంధ గ్రామమైన కొత్తపల్లికి చెందిన మట్టెడ నరేశ్కు ఇద్దరు కొడుకులు. మట్టెడ అహర్షిత్(16) ఇంటర్ ఫస్ట్ ఇయర్ , అన్విత్(9) నాలుగో తరగతి చదువుతున్నారు. ఉగాది సందర్భంగా బుధవారం సెలవు రావడంతో అన్నదమ్ములు ఇద్దరూ గ్రామానికి దగ్గర్లోని ఎస్సారెస్పీ కెనాల్ లో ఈతకు వెళ్లారు. నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో ఇద్దరూ కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు కేయూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న హనుమకొండ ఏసీపీ కిరణ్ కుమార్, ఎస్ఐ సతీశ్కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.