
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదును 100 శాతం లబ్ధిదారులకు నేరుగా అందించేలా కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ట్రెజరీ సింగిల్ అకౌంట్(టీఎస్ఏ) ద్వారా నూతన విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీని ద్వారా లబ్ధిదారులకు డైరెక్ట్గా నిధులు అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై అన్ని మంత్రిత్వ శాఖల నుంచి అవసరమైన సమాచారంతో పాటు అభిప్రాయాలను కేంద్ర ఆర్థిక శాఖ తీసుకుంటోంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని చూస్తుంది. పంట బీమా, లేబర్ వెల్ఫేర్ స్కీంలు, పేదలకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు, మెట్రో ప్రాజెక్టులు, భారత్ నెట్, నమామి గంగా వంటి అనేక స్కీంల నిధులను డైరెక్ట్గా లబ్ధిదారులకు చేరేలా ప్లాన్ చేస్తోంది. రూ.500 కోట్లు, అంతకుమించిన నిధులతో కూడిన ప్రాజెక్టుల విషయంలో ఈ విధానాన్ని అవలంబించాలని యోచిస్తోంది. వివిధ స్కీంలకు కేంద్రం అందిస్తోన్న నిధుల్ని పలు రాష్ట్రాలు దుర్వినియోగం చేయడం, దారి మళ్లిస్తుండటంతో వాటికి చెక్ పెట్టేలా ఈ విధానాన్ని తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన ఒక కీలక అధికారి తెలిపారు.
ప్రస్తుత విధానం..
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆయా మంత్రిత్వ శాఖలు రిజర్వ్ బ్యాంక్ నుంచి నిధులను డ్రా చేసుకొని, రాష్ట్ర ఖజానాలకు బదిలీ చేస్తున్నాయి. అక్కడి నుంచి సంబంధిత మినిస్ట్రీలకు, స్కీం అమలు చేసే ఏజెన్సీలకు, జిల్లా, తాలుకా స్థాయికి నిధులు వెళ్తున్నాయి. చివరగా లబ్ధిదారులకు అందుతున్నాయి. ఈ ప్రక్రియలో లోపాలు, దుర్వినియోగం, దారి మళ్లింపు, నిధుల్ని ఖర్చు చేయకపోవడం వంటి పరిస్థితులు తలెత్తున్నాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ సహా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తుండటంతో పాటు దారి మళ్లిస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిధులతో పథకాలు అమలు చేస్తూ, తామే ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేసుకుంటున్నాయి. దీంతో నిధులిస్తున్నా ప్రజల నుంచి
ఆశించిన స్థాయిలో ఫలితాలు, ఘనత కేంద్రానికి దక్కడం లేదు.
కొత్త విధానంలో..
టీఎస్ఏ ద్వారా దేశ ఖజానా నుంచి రిజర్వ్ బ్యాంకు ద్వారా నేరుగా లబ్ధిదారులకు నిధులు బదిలీ కానున్నాయి. ఈ నూతన విధానం అమల్లోకి వస్తే ప్రతి మంత్రిత్వ శాఖలో స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రత్యేక విభాగాన్ని సెంట్రల్ నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేస్తారు. ఈ నోడల్ ఏజెన్సీలు రిజర్ బ్యాంకులో అకౌంట్స్ ఓపెన్ చేసి, లబ్ధిదారులకు నిధులను బదిలీ చేస్తాయి. రూ.500 కోట్లలోపు పథకాల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వాములను చేయనుంది. అయితే, అమలులో ప్రతి కేంద్ర మంత్రిత్వ శాఖ, ఒక కేంద్రీయ సంస్థను ఏర్పాటు చేసి, ఆ సంస్థనే బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేస్తుంది. కేంద్రం ఇచ్చే నిధులు నేరుగా ఆ అకౌంట్కే వెళ్తాయి. అక్కడి నుంచి లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ అవుతాయి. పంటల బీమా, కిసాన్ సమ్మాన్ నిధి సహా రైతులకు లబ్ధి చేకూర్చే పథకాలు, పేదలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు, కార్మిక సంక్షేమ పథకాలు సహా అనేక రంగాల్లోని కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో రాష్ట్రాలను తప్పించి నేరుగా లబ్ధిదారులకే అందించనుంది.
మరిన్ని వార్తల కోసం