
కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్ ను డెలివరీ బాయ్ ఆరగించిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన అమన్ జైస్వాల్ అనే వ్యాపారవేత్త ఆదివారం రాత్రి తన ఆకలిని తీర్చుకోవడానికి ఓలా క్యాబ్స్ కు చెందిన ఫుడ్ డెలివరీ సంస్థ ఓలా కేఫ్ లో ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేశాడు.
ఆర్డర్ తీసుకున్న అనంతరం డెలివరీ బాయ్ అమన్ జైస్వాల్ కు ఫోన్ చేసి నేను మీ ఆర్డర్ తీసుకొని రావడానికి అదనంగా 10 రూపాయలు ఇవ్వాలని కోరగా అప్పటికే ఆకలి మీదున్న అమన్ సరే రండి నేను ఇస్తానని చెప్పి కాల్ కట్ చేశాడు.
దాదాపు 45 నిమిషాలు ఫుడ్ కోసం వేచి చూసిన అమన్ బయటకు వెళ్లి చూడగా సదరు డెలివరీ బాయ్ మరో డెలివరీ బాయ్ తో కలిసి లొకేషన్ లో బైక్ పై కూర్చుని ఆ ఫుడ్ ను తినడం గమనించాడు. ఈ ఫుడ్ నేను ఆర్డర్ చేసింది మీరు ఎందుకు తింటున్నారని అడగ్గా డెలివరీ బాయ్ బేఖాతరు చేస్తూ మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో ఈ తతంగాన్ని వీడియో తీసిన జైశ్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోను ఓలా కేఫ్ సంస్థకు ట్యాగ్ చేశాడు.