తీరనున్న రైల్వే గేటు​ కష్టాలు.. అందుబాటులోకి రానున్న క్యాతనపల్లి రైల్వే ఫ్లైఓవర్​ బ్రిడ్జి

తీరనున్న రైల్వే గేటు​ కష్టాలు.. అందుబాటులోకి  రానున్న క్యాతనపల్లి రైల్వే ఫ్లైఓవర్​ బ్రిడ్జి
  • నిర్మాణ పనుల్లో పదేండ్లు జాప్యం చేసిన బీఆర్​ఎస్​ పాలకులు
  • పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి చొరవతో పూర్తయిన పనులు

కోల్​బెల్ట్​, వెలుగు: క్యాతనపల్లి  రైల్వే గేటు సమస్య ఎట్టకేలకు తీరనుంది. రూ.35 కోట్ల ఫండ్స్​తో క్యాతనపల్లి రైల్వే గేటు వద్ద  చేపట్టిన ఫ్లైఓవర్​ బ్రిడ్జి(ఆర్వోబీ) అప్రోచ్​ రోడ్డు పనులు పూర్తి కానున్నాయి.   మరో 10 రోజుల్లోగా బ్రిడ్జి రాకపోకలకు  అందుబాటులోకి రానుంది.  చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవచూపడంతో దశాబ్దకాలంగా నిరీక్షిస్తున్న  రైల్వే ఫ్లైఓవర్​ బ్రిడ్జి కలలు సాకారం కానున్నాయి. 

రైల్వే ఫ్లైఓవర్​ బ్రిడ్జి కోసం డిమాండ్​…

మందమర్రి, నెన్నెల  మండల పరిధిలోని రామకృష్ణాపూర్​, మందమర్రి పట్టణాలతో పాటు 30 ఊర్లకు చెందిన వేలాది మంది నిత్యం క్యాతన్​పల్లి రైల్వే గేటు మీదుగా జిల్లా కేంద్రానికి వెళ్తుంటారు. చెన్నై న్యూఢిల్లీ బ్రాడ్​గేజ్​ మార్గంలో రైల్వే గేటు ఉంది. ప్రతి ఐదు నిమిషాలకు ఒక రైలు వస్తుండగా.. సుమారు 140 రైళ్లు రాకపోకలు జరుగుతుండడం వల్ల  గేటు వద్ద ట్రాఫిక్​ జామ్​ అవుతుండేది.  ప్రజలు గంటల తరబడి గేట్ వద్ద నిరీక్షించాల్సి వచ్చేది. సకాలంలో ఆసుపత్రికి వెళ్లలేక రైల్వేగేటు  వద్దనే కొంతమంది ప్రాణాలు కోల్పోయారు.  రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్​ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మించాలని స్థానికులు ఏళ్లుగా  డిమాండ్ చేశారు. 

పదేండ్లు దాటిన పూర్తికాని అప్రోచ్​రోడ్డు

రైల్వే శాఖ ఆధ్వర్యంలో ట్రాక్​పై ఆర్వోబీ పూర్తి చేయగా దానికి ఇరువైపులా 1100  మీటర్ల పొడవున చేపట్టిన  అప్రోచ్​రోడ్డు నిర్మాణ పనులను అప్పటి బీఆర్​ఎస్​ పాలకులు పదేండ్లలో చేయించలేకపోయారు. అప్రోచ్​ రోడ్డు కోసం సుమారు 8.22 ఎకరాల స్థలాన్ని సేకరించారు. భూ నిర్వాసితుల నష్టపరిహారం చెల్లింపులో ఆలస్యం కాగా కొందరు  హైకోర్టును ఆశ్రయించారు. స్థలసేకరణ, భూనిర్వాసితుల సమస్య పరిష్కారంపై  అప్పటి బీఆర్​ఎస్​ ప్రజాప్రతినిధులు దృష్టి సారించలేదు. చెన్నూరు ఎమ్మెల్యేగా నల్లాల ఓదెలు కొనసాగుతున్న కాలంలో రాష్ట్ర సర్కార్​ అప్రోచ్​ రోడ్డు, భూనిర్వాసితుల పరిహారం కోసం రూ. 30.50 కోట్లను శాంక్షన్​ చేసింది.  

రైల్వే గేటు వద్ద ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. 

క్యాతనపల్లి రైల్వే గేటు వద్ద రైల్వే ఫ్లైఓవర్​ బ్రిడ్జి అప్రోచ్​ రోడ్డు పనుల్లో జాప్యంతో ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు పదేండ్లు ఇబ్బందులు పడ్డారు. దానికి తోడు తరచూ టెక్నికల్​ ప్రాబ్లమ్, రిపేర్ల పేరు​తో రోజుల తరబడి  మూసి ఉండేది. వైద్యం కోసం వెళ్తూ గేటు వద్ద నిరీక్షించి పలువురు ప్రాణాలు  కోల్పోయారు.  నవంబర్​15, 2023లో రైల్వే గేటు పడడంతో కింది నుంచి బైక్​ తీసుకువెళ్తుండగా రైలు ఢీకొని భూక్యా సురేశ్​, కుంబాల చందు అనే యువకులు చనిపోయారు.  కాంట్రాక్టర్​ బ్రిడ్జి ఫిల్లర్ల కోసం గుంత తవ్వి వదిలివేయడంతో ప్రమాదవశాత్తు ఒకరు అందులో పడి చనిపోయాడు.  

ఎమ్మెల్యే, ఎంపీ చొరవతో పనుల్లో స్పీడ్​..

రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి అప్రోచ్​ రోడ్డు నిర్మాణంలో భాగంగా మంచిర్యాల వైపు సుమారు 25 మంది, రామకృష్ణాపూర్​ వైపు 11 మంది రైతులు  తమ భూములను కోల్పోయారు. రామకృష్ణాపూర్​ వైపు ఉన్న వారికి పదేండ్లలో ఎలాంటి పరిహారం ఇవ్వకపోగా సర్వీసు రోడ్డు కోసం భూమి కూడా సేకరించలేదు.   చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన వివేక్​ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రైల్వే ఫ్లైఓవర్​ బ్రిడ్జి పనులను పూర్తి చేయించడంపై దృష్టి సారించారు.  బీఆర్​ఎస్ పాలకుల నిర్లక్ష్యం కారణంగా 11 మంది భూనిర్వాసితులు పరిహారం రాకపోవడంతో  ఉన్నతాధికారులతో మాట్లాడి రూ. 50  నుంచి 70  లక్షల పరిహారం ఇప్పించారు.  రామకృష్ణాపూర్​ వైపు సర్వీసు రోడ్డుకు అవసరమైన భూమిని సేకరించారు. జైపూర్​ సింగరేణి థర్మల్​ పవర్​ ప్లాంట్​ ఆఫీసర్లతో మాట్లాడి   అప్రోచ్​ రోడ్డుకు అవసరమైన ఫ్లైయాష్​ను ఇప్పించారు. పనుల్లో నిర్లక్ష్యం చూపుతున్న కాంట్రాక్టర్​పై చర్యలకు ఆదేశించారు. ఫ్లైఓవర్​ బ్రిడ్జిపై మరో లేయర్​ బీటీ, రంగులు ​ వేయాల్సి ఉందని ఆర్​అండ్​బీ ఆఫీసర్లు పేర్కొంటున్నారు.  

ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి చొరవతో ఫండ్స్​…  

పదేళ్లుగా ప్రజలు పడుతున్న కష్టాలు దూరం చేసేందుకు అప్పటి పెద్దపల్లి ఎంపీ డాక్టర్​ జి.వివేక్​వెంకటస్వామి 2014లో రూ.32కోట్లు నిధులను ఆర్వోబీ నిర్మాణం కోసం  కేంద్రం నుంచి శాంక్షను చేయించారు. 2014 సంవత్సరం సెప్టెంబర్​లో క్యాతనపల్లి గేటు వద్ద గల రైల్వే ట్రాక్​ పైభాగంలో రైల్వేశాఖ ఆర్వోబీ(బ్రిడ్జి) పనులు చేపట్టి ఏడాదిలోపు పూర్తి చేసింది.