- 2027 నాటికి రూ.102 లక్షల కోట్లకు..సీఐఐ రిపోర్ట్ వెల్లడి
చెన్నై: దేశీయ ఆహార మార్కెట్ 47 శాతం వృద్ధి చెంది 2027 నాటికి 1,274 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.102 లక్షల కోట్లు) చేరుకుంటుందని తాజా రిపోర్ట్ వెల్లడించింది. దక్షిణాది రాష్ట్రాలకు ఫుడ్ప్రాసెసింగ్ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), డాన్ఫాస్ ఇండియా కలసి 'భారతదేశంలో ఆహార ప్రాసెసింగ్ రంగం, - దక్షిణాది రాష్ట్రాలకు అవకాశాలు' పేరుతో తయారు చేసిన రిపోర్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది.
డాన్ఫాస్ ఇండియా హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ కంపెనీ. డెన్మార్క్కు చెందిన ఇంజినీరింగ్ మేజర్ డాన్ఫాస్కి అనుబంధ సంస్థ. ఈ రిపోర్ట్ ప్రకారం.. భారతదేశపు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అత్యాధునిక సాంకేతికతతో దూసుకెళ్తోంది. ఈ రంగంలో స్టార్టప్ల సంఖ్య పెరుగుతోంది. మనదేశం 2023–-24లో 220.81 మిలియన్ డాలర్ల విలువైన 2,08,370 మెట్రిక్ టన్నుల ఆహార వస్తువులను ఎగుమతి చేసింది. ఇది పరిమాణంలో 33 శాతానికి, విలువలో 27 శాతం వాటాకు సమానం.
ప్రాసెసింగ్ పండ్లు, రసాలు గింజల ఎగుమతిలో తమిళనాడు అగ్రగామిగా ఉంది. దక్షిణాది ఫుడ్ ప్రాసెసింగ్ రంగం దూసుకెళ్తున్నది. చిరుధాన్యాలు, రెడీ టూ ఈట్ స్నాక్స్వంటి ప్రొడక్టులతో ముందుకు సాగుతోంది. దీనివల్ల రైతులకు అపారమైన అవకాశాలు వస్తున్నాయి. భారతదేశ ఎగుమతులను ప్రపంచ వేదికపైకి తీసుకురావడంలో టెక్నాలజీ కీలకమని సీఐఐ నేషనల్ కౌన్సిల్ ఫర్ కోల్డ్ చైన్ అండ్ అగ్రి లాజిస్టిక్స్ చైర్మన్ రవిచంద్రన్ పురుషోత్తమన్ అన్నారు. పర్యావరణ అనుకూల ఫుడ్ప్రాసెసింగ్ సొల్యూషన్స్ మనదేశ ముఖచిత్రాన్ని మారుస్తాయని కామెంట్చేశారు.