
= రైతుల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యం
= వరి సాగులో మన రాష్ట్రమే టాప్
= రైతుల కోసం ప్రత్యేకంగా కమిషన్
= రూ. 25 వేల కోట్లతో రైతు రుణమాఫీ
= మహాలక్ష్మి స్కీం గేమ్ చేంజర్
= స్కిల్ వర్సిటీతో యువత నైపుణ్యం పెంచుతున్నం
= అసెంబ్లీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
= బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి అన్నదాతలే ఆత్మ అని, రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. రైతుల స్వేదం, కష్టం మనలను పోషిస్తోందని చెప్పారు. 260 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తితో దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించిందని అన్నారు. రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసిందని చెప్పారు. సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాకు రూ. 500 చొప్పన బోనస్ ఇవ్వడం సత్ఫలితాలను ఇస్తోందని చెప్పారు. రూ. 25 వేల కోట్లతో రైతు రుణమాపీ చేశామని తెలిపారు. రైతు భరోసా కింద ఎకరానికి రూ.12 వేల చొప్పున వారికి అందిస్తున్నాం. రైతు నేస్తం అమలు చేస్తున్నామని అన్నారు.
మహాలక్ష్మి గేమ్ చేంజర్
రాష్ట్రంలో గేమ్ ఛేంజర్గా మహాలక్ష్మి పథకం నిలిచిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు. ఉచిత బస్సు పథకానికి రూ.5,005 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. ఉచితంగా రూ. 500 సిలిండర్ ఇస్తున్నామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మహిళా సంఘాలతో ఇందిరా శక్తి క్యాంటిన్ లు ఏర్పాటు చేశాం. మహిళా సంఘాలకు యూనిఫాంలు కుట్టే అవకాశం కల్పించామని చెప్పారు.
ALSO READ | మార్చి 27 వరకు తెలంగాణ అసెంబ్లీ..19న బడ్జెట్
మరోవైపు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో యవతలో నైపుణ్యాన్ని పెంచుతున్నామని అన్నారు. పేదకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని తెలిపారు. నిరుపేదలను అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని అన్నారు. ఏడాదిలోనే 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తే చేశామని, ప్రపంచ స్థాయి ఆటగాళ్లను తయారు చేసేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ రూపుదిద్దుకుంటోందని తెలిపారు. రాష్ట్రానికి రూ.1.78 వేల కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం తీసుకొచ్చిందని.. ఆ పెట్టుబడుల ద్వారా 49,500 మందికి ఉపాధి లభించనుందని అన్నారు.
గవర్నర్ స్పీచ్ లో గద్దర్, గూడ అంజన్న
తెలంగాణ ఘనమైన సంస్కృతికి నిలయమని గవర్నర్ అన్నారు. గద్దర్, అంజయ్య వంటి ఎందరో ప్రజల కోసం కృషి చేశారని చెప్పారు. జయజయహే తెలంగాణ జననీ జయకేతనం రాష్ట్ర గీతంగా చేసుకున్నామని గుర్తు చేశారు. సామాజిక న్యాయం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించుకున్నామని చెప్పారు. అభివృద్ధి, ప్రగతి వైపు తెలంగాణ అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ నినాదాలతో గవర్నర్ తన ప్రసంగం ముగించారు.