తెలంగాణలో భవిష్యత్తు మాదే.. బీఆర్‌ఎస్ ఓ ఫామ్‌హౌస్​ పార్టీ: హోంమంత్రి అమిత్​షా

తెలంగాణలో భవిష్యత్తు మాదే.. బీఆర్‌ఎస్ ఓ ఫామ్‌హౌస్​ పార్టీ: హోంమంత్రి అమిత్​షా
  • బీఆర్‌ఎస్‌తో పొత్తు ముచ్చట్నే లేదు
  • బీఆర్​ఎస్​ను ప్రజలే ఖాళీ చేశారు.. మేం ఖాళీ చేయాల్సిన పని లేదు
  • దోచుకోవడానికి కొడుకు, కూతుర్ని కేసీఆర్​ వదిలిండు
  • రాష్ట్రంలో సంస్థాగతంగా బలపడ్తున్నం..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం బీజేపీదే
  • పార్టీలోని కొత్త నేతలు హద్దులు దాటొద్దు.. త్వరలో రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడి ప్రకటన
  • తమిళనాడు, పశ్చిమ బెంగాల్​లోనూ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడి
  • బీజేపీలో జనసేన విలీనమయ్యే ప్రసక్తి లేదని వ్యాఖ్య
  •  మీడియా చిట్​చాట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్​షా వ్యాఖ్యలు

కోయంబత్తూర్: తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదేనని, సంస్థాగతంగా తాము బలపడుతున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అన్నారు. దక్షిణాదిలో తెలంగాణ, తమిళనాడులో విజయం సాధించడమే టార్గెట్​గా పనిచేస్తున్నామని.. అటు పశ్చిమబెంగాల్​లోనూ అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్‍ఎస్​పని అయిపోయిందని, ఆ పార్టీ ఫామ్​ హౌస్​కే పరిమితమైందని విమర్శించారు. 

‘‘బీఆర్​ఎస్​తో మాకు పొత్తు ముచ్చట్నే లేదు. అదో ఫామ్​హౌస్​ పార్టీ. ఫామ్​హౌస్​ నుంచి పార్టీని నడిపిస్తే దానికి భవిష్యత్తు ఉంటుందా? మేం తెలంగాణలో ఏ పార్టీతోనూ కలిసి లేం” అని అమిత్​ షా స్పష్టం చేశారు. 

బుధవారం రాత్రి తమిళనాడులోని కోయంబత్తూర్​లో అమిత్​ షా మీడియాతో చిట్​ చాట్​ చేశారు. దీన్ని ఓ ఆంగ్ల దినపత్రిక ప్రచురించింది. బీఆర్​ఎస్​, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందంటూ కాంగ్రెస్​ చేస్తున్న ఆరోపణలను చిట్​చాట్​లో అమిత్​ షా ఖండించారు. తాము బీఆర్​ఎస్​తో కలిసే ప్రసక్తి లేదన్నారు. దోచుకోవడానికి కొడుకు, కూతుర్ని కేసీఆర్​ వదిలారని.. ఇప్పటికే అనేక అవినీతి కేసుల్లో బీఆర్​ఎస్​ కూరుకుపోయిందని ఆయన ఆరోపించారు. 

అవినీతి, కుటుంబ పార్టీ బీఆర్​ఎస్​ అని విమర్శించారు. సిద్ధాంతపరమైన బీజేపీకి అవినీతి, కుటుంబ పార్టీతో పొత్తు ఉండదని ఆయన పేర్కొన్నారు. ‘‘బీఆర్​ఎస్​ను మేం ఖాళీ చేయాల్సిన పనిలేదు. తెలంగాణ ప్రజలే ఖాళీ చేశారు. ప్రస్తుతం ఫామ్​హౌస్​ నుంచే ఆ పార్టీ నడుస్తున్నది. దానికి ఫ్యూచర్​ లేదు. రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయం, ప్రధాన ప్రతిపక్షం బీజేపీనే. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నం” అని ఆయన వివరించారు. 

తెలంగాణ, తమిళనాడు, బెంగాల్​ ఎన్నికలే టార్గెట్​

దక్షిణాదిలో తాము తెలంగాణ, తమిళనాడులో అధికారంలోకి రావాలన్న టార్గెట్​తో ముందుకు వెళ్తు న్నామని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అన్నారు. 2014 నుంచి సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నిస్తున్నామని.. తెలంగాణలో ప్రస్తుతం పార్టీ బలంగా ఉందని,  ప్రధాన ప్రతిపక్షం కూడా తామేనని ఆయన చెప్పారు.

‘‘తెలంగాణలో భవిష్యత్తు మాదే. తప్పకుండా అధికారంలోకి వస్తాం. ఉత్తరాఖండ్​, ఒడిశాలోనూ మేం మొదట సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నించారు. అదే ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి దోహదపడింది” అని వివరించారు. తమిళనాడులో అన్నాడీఎంకే, సినీ నటుడు విజయ్​ పార్టీ ‘టీవీకే’తో బీజేపీకి పొత్తు ఉంటుందా? అని ప్రశ్నించగా..  ఎన్డీయేకు, డీఎంకేకు మధ్యనే తమిళనాడులో పోటీ ఉంటుందని అమిత్​ షా వ్యాఖ్యానించారు. బీజేపీలో పవన్​ కల్యాణ్​ పార్టీ జనసేన విలీనం అవుతుందా? అని ప్రశ్నించగా.. అలాంటి ప్రశ్నే ఉత్పన్నం కాదని ఆయన స్పష్టం చేశారు.  

కొత్త నేతలు గీత దాటొద్దు

బీజేపీలో కొత్తగా చేరిన లీడర్లు గీత దాటొద్దని అమిత్​షా వార్నింగ్​ ఇచ్చారు. పాత, కొత్త లీడర్ల సమస్యతోనే బీజేపీ తెలంగాణ రాష్ట్ర చీఫ్​ ప్రకటన పెండింగ్​లో ఉందా? అని ప్రశ్నించగా.. పలు రాష్ట్రాల్లోనూ ఈ ఇష్యూ పెండింగ్​లో ఉందన్నారు. కొత్త లీడర్లు హద్దులు దాటొద్దని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు. త్వరలోనే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు జాతీయ అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని ఆయన వెల్లడించారు.