
పర్వతగిరి (వరంగల్), వెలుగు: చెవులు కుట్టే ప్రోగ్రాం ఉండటంతో ఇళ్లంతా చుట్టాలతో నిండిపోయింది. ఎంతో ఉత్సాహంగా స్కూల్కు వెళ్లిన ఆ చిన్నారి ఫ్రెండ్స్కు చెప్పుకుని మురిసిపోయింది. బాత్రూం వెళ్లడానికి క్లాస్ నుంచి బయటికి వచ్చింది. అప్పుడే పాము కాటేయడంతో హాస్పిటల్కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండ శివారులోని భట్టుతండాలో బుధవారం జరిగింది. భట్టు మోహన్, పార్వతిలకు ఇద్దరు బిడ్డలు. పెద్ద కూతురు భట్టు మన్విత (6) తండాలోని ప్రైమరీ స్కూల్లో చదువుతున్నది. బుధవారం ఉదయం స్కూల్కు వెళ్లింది. గురువారం చెవులు కుట్టే ప్రోగ్రాం ఉందని ఫ్రెండ్స్కు చెప్పుకొని మురిసిపోయింది. బాత్రూం వస్తుందని టీచర్కు చెప్పడంతో వెళ్లమన్నాడు. క్లాస్ రూం నుంచి బయటికొచ్చిన మన్విత.. మెట్లు దిగుతుండగా తాచుపాము కాటేసింది. ఈ విషయాన్ని టీచర్కు చెప్పడంతో అతను పేరెంట్స్కు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి మన్వితను నర్సంపేట హాస్పిటల్కు తరలిస్తుండగా, మార్గమధ్యలో చనిపోయింది. చెవులు కుట్టే ప్రోగ్రాం ఉండటంతో ఇంటికొచ్చిన బంధువులు మన్విత చనిపోయిందని తెలుసుకుని కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.