చనువు పెంచుకున్నాడు.. హత్యకు యత్నించి సొత్తు దోచుకెళ్లాడు

చనువు పెంచుకున్నాడు.. హత్యకు యత్నించి సొత్తు దోచుకెళ్లాడు
  • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు 

శంకర్​పల్లి, వెలుగు:  ఒంటరి వృద్ధురాలితో చనువు పెంచుకున్నాడు. ఆమె హత్యకు యత్నించి  సొత్తు దోచుకెళ్లిన ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లిలో చోటు చేసుకుంది. నార్సింగి ఏసీపీ లక్ష్మినారాయణ, సీఐ వినాయక్​రెడ్డి తెలిపిన ప్రకారం.. శంకర్​పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫత్తేపూర్​కి చెందిన బాలమ్మ(55) వృద్ధురాలు. ఒంటరి ఉంటుండగా, ఆమె ఇంటి పక్కన నివసించే మహిళ తండ్రి షాబాద్​ మండలం దోసాడకి చెందిన శంకరయ్య తరచూ కూతురి వద్దకు వచ్చి వెళ్తుండేవాడు. 

దీంతో వృద్ధురాలితో ఆయన చనువు పెంచుకున్నాడు. వృద్ధురాలి నుంచి అన్ని విషయాలు తెలుసుకున్నాడు. ఆమెను హత్య చేసి సొత్తు దోచుకెళ్లేందుకు ప్లాన్ చేశాడు.  సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో బాలమ్మ ఇంటికి వెళ్లిన శంకరయ్య తలుపుకొట్టి లేపాడు. 

అనంతరం ఆమెను కిందపడేసి తలపై దిండును అదిమిపెట్టాగా స్పృహ కోల్పోయింది. చనిపోయిందనుకుని శంకరయ్య ఆమె ఇంట్లోని 50 తులాల వెండి, 7 గ్రాముల బంగారం, 5 వేల నగదు తీసుకుని ఇంటికి తాళం వేసి పారిపోయాడు. 

ఉదయం బాలమ్మకు మెలకువ వచ్చి లేచి గట్టిగా అరవడంతో  ఇరుగుపొరుగు వచ్చి తాళం తీయగా జరిగిన విషయం చెప్పింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేయగా సీసీ కెమెరాల ఫుటేజ్ ల ఆధారంగా నిందితుడిని 10 గంట్లలోనే పట్టుకుని, సొత్తు రికవరీ చేసి కేసు నమోదు చేశారు. 

దొంగను పట్టుకోవడంతో చాకచక్యంగా వ్యవహరించిన డీఐ నాగరాజు, క్రైమ్​ ఎస్ ఐ సత్యనారాయణ, కానిస్టేబుళ్లు నాగభూషణం, శ్రీనివాస్​లను ఏసీపీ అభినందించారు.