ఐకానిక్ బ్రిడ్జికి లైన్ క్లియర్! నెలాఖరులోగా టెండర్లు .. తెలంగాణ – ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా నదిపై ప్రాజెక్ట్

ఐకానిక్ బ్రిడ్జికి లైన్ క్లియర్! నెలాఖరులోగా  టెండర్లు .. తెలంగాణ – ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా నదిపై ప్రాజెక్ట్
  • కేంద్రం లేఖపై  ఏండ్లుగా పట్టించుకోని గత సర్కార్ 
  • హైదరాబాద్ టు తిరుపతి కొత్త హై వేతో పాటు నిర్మాణం
  • టూరిజం హబ్ గా మారనున్న కొల్లాపూర్ ప్రాంతం

నాగర్​ కర్నూల్, వెలుగు :
 కృష్ణా నదిపై కేంద్ర ప్రభుత్వం నిర్మించే ఐకానిక్​బ్రిడ్జి నిర్మాణానికి లైన్​క్లియర్​అవుతోంది. హైదరాబాద్​నుంచి తిరుపతికి 80 కి.మీలు తగ్గేలా నిర్మించే కొత్త హైవే పనులు ఇప్పటికే 60 శాతం పూర్తి కావొచ్చాయి. నాగర్​కర్నూల్​జిల్లా కొట్ర నుంచి ఏపీలోని నంద్యాల వరకు 167 – కే  హై వే పనులు స్పీడ్ గా నడుస్తున్నాయి. బ్రిడ్జి నిర్మాణానికి కూడా టెండర్లను నేషనల్​హైవే​సంస్థ పిలిచింది. 

కాగా.. ఈ నెలాఖరులోగా ఫైనల్​చేయనున్నట్లు.. ఆ లోపు ఏపీలో ఫారెస్ట్​ క్లియరెన్స్​రాగానే ఖరారు కానున్నట్టు తెలిసింది. రూ.1,082.56 కోట్లతో నిర్మించే​బ్రిడ్జి తెలంగాణలోని సోమశిల(మల్లేశ్వరం) నుంచి ఏపీలోని సంగమేశ్వరం వరకు నదిలో కేవలం రెండు పిల్లర్లపై దాదాపు1.77 కిలో మీటర్లు నిర్మాణం కానుంది. డబుల్​స్టోర్డ్​బ్రిడ్జిలోపై నుంచి వాహనాలు వెళ్తాయి. 

సెకండ్ ​ఫ్లోర్​లో గ్లాస్ ​రోడ్డు ఉంటుంది. కృష్ణా నది అందాలు చూసేందుకు గ్లాస్ ​బ్రిడ్జిపై నుంచి నడిచివెళ్లే చాన్స్ కల్పిస్తారు. బ్రిడ్జి నుంచి  పడవలు, బోట్లు, లాంచీలు వెళ్లేందుకు రెండు పిల్లర్ల మధ్య 482 మీటర్ల దూరం ఉండేలా నిర్మించనున్నారు. 

 ఐదు ప్యాకేజీలుగా పనులు

కొల్లాపూర్​ సెగ్మెంట్ మల్లేశ్వరం సమీపంలో నిర్మించే బ్రిడ్జి నుంచి ఇరువైపులా అప్రోచ్ ​రోడ్డు( తెలంగాణ వైపు 8.30 కి. మీ, ఏపీ వైపు5.30కి.మీ) పనులకు రూ. 436.9 కోట్లు మంజూరయ్యాయి. ఈ హై వే పనులను ఐదు ప్యాకేజీలుగా అధికారులు విభజించారు. ప్యాకేజీ-–1లో కల్వకుర్తి సెగ్మెంట్ లోని కొట్ర నుంచి కొల్లాపూర్​ (రూ.401 కోట్లు), ప్యాకేజీ-–2లో అప్రోచ్​రోడ్లకు రూ.286 కోట్లు, ప్యాకేజీ–3లోని డబుల్​హైబ్రిడ్ సస్పెన్షన్​ కేబుల్​బ్రిడ్జి నిర్మాణానికి రూ.1,082 కోట్లు, ప్యాకేజీ-–4లో ఏపీలోని సంగమేశ్వరం నుంచి ఆత్మకూరు, వెలుగోడు, నంద్యాల వరకు రూ.380 కోట్లు, ప్యాకేజీ–5లో వెలుగోడు రిజర్వ్​ ఫారెస్ట్​లో రోడ్డు నిర్మాణానికి రూ.100 కోట్లు కేటాయించారు.  

 ఇక పర్యాటక హబ్ గా కొల్లాపూర్  

 నేషనల్ హై వే–167కే నిర్మాణంతో పాటు ఐకానిక్​బ్రిడ్జి పనులు పూర్తయితే కొల్లాపూర్​పర్యాటక హబ్ గా మారనుంది. ఈ ప్రాంతమంతా నల్లమల అడవితో పాటు కృష్ణా నది బ్యాక్​ వాటర్​తో రెండు నదులు కలిసి ప్రవహిస్తున్నట్లుగా ఉంటుంది. కొల్లాపూర్​సంస్థానం, రాజవారి కోట, మాధవస్వామి ఆలయం, సోమశిల, అమరగిరి, మల్లేశ్వరం, మంచాలకట్ట,  జటప్రోల్ ​ప్రాంతాలు ఆధ్మాత్మిక, ఎకో టూరిజం, వాటర్​ స్పోర్ట్స్, సోమశిల నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణంతో పర్యాటక ప్రాంతంగా మారుతాయి. 

మరోవైపు ఇక్కడి పర్యాటక ప్రదేశాలను తెలంగాణ టూరిజం, ఫారెస్ట్​డిపార్ట్​మెంట్​తో పాటు నేషనల్​హైవే సంస్థ కూడా ప్రచారం చేసుకుంటాయి. ఇక సప్త నదుల సంగమ క్షేత్రంలో ఏడాదిలో 9 నెలల పాటు కృష్ణా నదిలో మునిగి ఉండే సంగమేశ్వర ఆలయం, అంకాలమ్మ కోట వంటివి కూడా అభివృద్ధి చెందే చాన్స్ ఉంది.  

కేంద్రం అడిగినా పట్టించుకోని బీఆర్ఎస్ సర్కార్ 

కల్వకుర్తి సెగ్మెంట్ లోని కొట్ర నుంచి ఏపీలోని నంద్యాల వరకు నేషనల్ హై వే–167 కే నిర్మాణంతో పాటు   కృష్ణానదిపై ఐకానిక్  బ్రిడ్జి ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించింది. అయితే.. బ్రిడ్జికి ప్రపోజల్స్​ఇవ్వాలని కోరుతూ 2019లో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ కు  కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. కాగా.. 2022 వరకు పట్టించుకోలేదు.  బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలిచి ఈనెల చివరి వరకు  ఫైనల్​చేయాలనే ఎంఆర్​హెచ్​ ఆదేశాలతో దేశంలోనే తొలి డబుల్ ​హైబ్రిడ్​ కేబుల్ ​సస్పెన్షన్​ బ్రిడ్జి నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి.