బాలికపై లైంగిక దాడి.. నలుగురికి జైలు

బాలికపై లైంగిక దాడి.. నలుగురికి జైలు

చాంద్రాయణగుట్ట, వెలుగు : బాలికపై లైంగిక దాడి కేసులో నలుగురు నిందితులకు నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించింది. మరో వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఛత్రినాక ఆల్విన్ కాలనీకి చెందిన మేకల రాహుల్ (ఏ1), గౌలిపురాకు చెందిన నితిన్ (ఏ2 ), బోయగూడకు చెందిన దీక్షిత్ (ఏ3), శివగంగా నగర్​కు చెందిన డి.మల్లేశ్ (ఏ4) మరో వ్యక్తి (ఏ5) కలిసి ఓ బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఛత్రినాక పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఒకరు పరారీలో ఉండగా, నలుగురిని అరెస్ట్ పూర్తి ఆధారాలను కోర్టు సమర్పించారు. ఈ కేసులో నాంపల్లి కోర్టు న్యాయమూర్తి అనిత తీర్పు శుక్రవారం వెలువరించారు. ఏ1, ఏ2కు 25 ఏండ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా, ఏ3, ఏ4కు ఐదేండ్ల జైలు శిక్షతోపాటు రూ.5 వేల జరిమానా విధించింది. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న గంగానగర్​కు చెందిన రాజ్ కుమార్​ను నిర్దోషిగా విడుదల చేసింది. బాధితురాలికి రూ.7 లక్షల నష్టపరిహారం ప్రకటించింది.