
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 11న కొత్త మంత్రివర్గ ప్రమాణం ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ విషయాన్ని సీఎం జగన్ ఇవాళ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలసి తెలియజేశారు. అదే రోజున ప్రమాణ స్వీకారం చేయించాలని కోరినట్లు సమాచారం.
పాత మంత్రివర్గంలోని ఇద్దరు లేదా ముగ్గురు మినహా దాదాపు అందర్నీ తొలగించి కొత్త వారిని తీసుకుంటానని జగన్ సీఎం చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఉద్వాసన పలుకుతున్న వారికి సంకేతాలిచ్చిన సీఎం జగన్.. కొత్తగా తీసుకోనున్న వారికి రేపు లేదా ఎల్లుండి సమాచారం తెలిపే అవకాశం ఉంది. గవర్నర్ తో భేటీ సందర్భంగా మంత్రివర్గ జాబితాను రెండు రోజుల్లో అందజేస్తానని చెప్పినట్లు సమాచారం. పాత మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించి పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతంపై దృష్టి సారించే బాధ్యతలు అప్పగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రిపదవి నుండి తమను తొలగించడం ఖాయమని నిర్ధారించుకున్న అనేక మంది తమ తమ క్వార్టర్లను ఖాళీ చేసే పనిలో పడ్డారు. తమ శాఖల్లో పనిచేస్తున్న వారికి అంతర్గత బదిలీలు చేసి కోరిన స్థానాలు కేటాయింపులు చేస్తుండడంతో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై ఉత్కంఠ ఏర్పడింది.
ఇవి కూడా చదవండి
లోదుస్తుల్లో బంగారం దాచుకుని తీసుకొస్తుంటే..
వ్యతిరేకంగా మాట్లాడితే ఈడీతో దాడులు చేయిస్తారా..?
చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు
మాకు రాజకీయాలు తెలియదు.. అవినీతి అంతం చేయడమే తెలుసు