స్పీడ్ తగ్గించాలని అన్నందుకే.. కానిస్టేబుల్‌ను కారుతో గుద్ది చంపిన్రు

స్పీడ్ తగ్గించాలని అన్నందుకే.. కానిస్టేబుల్‌ను కారుతో గుద్ది చంపిన్రు

న్యూఢిల్లీ: కారు స్పీడ్ తగ్గించాలని కోరిన పోలీస్ కానిస్టేబుల్​ను అదే కారుతో గుద్ది చంపేసిన్రు. ఈ ఘటన ఢిల్లీలోని నాంగ్లోయ్ లో శనివారం అర్ధరాత్రి జరిగింది. సందీప్ అనే కానిస్టేబుల్ సివిల్ డ్రెస్​లో బైక్​పై పెట్రోలింగ్ చేస్తున్నాడు. వెనుక నుంచి వచ్చిన వ్యాగనార్ కారు అతన్ని ఓవర్ టేక్ చేయబోయింది. ర్యాష్ డ్రైవింగ్ చేస్తుండటంతో గమనించిన సందీప్.. కారు మెల్లిగా డ్రైవ్ చేయాలని సూచించాడు. మరింత రెచ్చిపోయిన డ్రైవర్.. స్పీడ్ మరింత పెంచాడు. దీంతో కారు ఆపాలని సందీప్ సూచించాడు. 

అది వినిపించుకోకపోగా.. కారుతో బైక్​ను ఢీకొట్టి 10 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లారు. స్థానికులు సందీప్​ను దగ్గర్లోని హాస్పిటల్​కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మరో హాస్పిటల్​కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. ఇద్దరు దుండగులు కారును అక్కడే వదిలేసి పారిపోయారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కారును పోలీసులు సీజ్ చేశారు. నిందితుల్లో ఒకడు ఇల్లీగల్ లిక్కర్ కేసులో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు.