
భైంసా, వెలుగు: భైంసా పట్టణంలో గణేశ్ ఉత్సవాలపై పోలీసు శాఖ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. పట్టణంలో సుమారు 200కు పైగా గణపతులను ప్రతిష్ఠించారు. ఈ నెల 8న నిమజ్జన శోభయాత్ర సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఏఎస్పీ కిరణ్ ఖారేల ఆధ్వర్యంలో నిఘా పటిష్ఠం చేశారు. ప్రార్థన మందిరాలు, సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్ఏర్పాటు చేశారు. అనుమానితుల కదలికలపై పోలీసులు కన్నేశారు. సుమారు 600 మంది పోలీసు బలగాలతో బందోబస్తు నియమించారు. నలుమూలల చెక్పోస్టులు ఏర్పాటు చేశారు.
లా అండ్ ఆర్డర్పై నజర్..
గతానుభవాలను దృష్టిలో ఉంచుకొని పోలీసు శాఖ లాఅండ్ఆర్డర్పై ప్రత్యేక దృష్టి పెట్టింది. గతంలో వినాయక, దుర్గమాత ఉత్సవాల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరిగి, రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో భైంసాలో ఏ ఉత్సవం జరిగినా పోలీసులు అలర్ట్అవుతున్నారు. భైంసా పట్టణమంతా సుమారు 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. శోభాయాత్రలో డీజేలకు పర్మిషన్ లేదని, ఎవరూ ఏర్పాటు చేయవద్దని ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే శాంతి కమిటీ సమావేశాలు సైతం నిర్వహించారు.
దుబాయ్ లో గణేశ్ ఉత్సవాలు
జన్నారం, వెలుగు: ఎడారి దేశం దుబాయ్ లో గణేశ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు తెలంగాణ గల్ఫ్కార్మికుల సంక్షేమ సమితి వ్యవస్థాపకుడు కల్లెడ భూమయ్య తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా గణేశుడిని ప్రతిష్టించి నిత్య పూజలు చేశామని ఆదివారం సాయంత్రం నిమజ్జనం చేసినట్లు భూమయ్య చెప్పారు.
ప్రజలు సహకరించాలి
భైంసాలో గణేశ్ నవరాత్రులు, నిమజ్జన శోభయాత్ర ప్రశాంత వాతావరణంలో జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నాం. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలి. ఇన్టైంలో శోభయాత్ర ముగించుకోవాలి.
- కిరణ్ ఖారే, ఏఎస్పీ