
- కమిషనర్ లేని కార్పొరేషన్..ఆడ్మినిస్ట్రేషన్ ఆగమాగం
- మూడు వారాలుగా కమిషనర్ పోస్టు ఖాళీ
- 77 శాతానికి పడిపోయిన పన్నుల వసూళ్లు
- కలెక్టర్కే ఇన్చార్జి బాధ్యతలు
- పని భారంతో తూతూ మంత్రంగా రివ్యూలు, మానిటరింగ్
- కొత్త కమిషనర్ నియామకంపై సర్కార్ నిర్లక్ష్యం
వరంగల్, వెలుగు : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కమిషనర్ పోస్టు మూడు వారాలు దాటినా ఖాళీగానే కనిపిస్తోంది. కమిషనర్ గా పనిచేసినప్రావీణ్య మార్చి 13న వరంగల్ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు. నగరంలో స్మార్ట్ సిటీ, అమృత్, హెరిటెజ్ వంటి కేంద్ర ప్రభుత్వ స్కీంలతో పాటు పట్టణ ప్రగతి, సీఎం అష్యూరెన్స్, గ్రేటర్ కార్పొరేషన్ తరఫున ఎన్నో ప్రాజెక్టులు చేపట్టగా వాటిని పట్టించుకునేవారు కరువయ్యారు. ఐఏఎస్ క్యాడర్ కమిషనర్ ఉండి ఎప్పటికప్పుడు రివ్యూలు, మానిటరింగ్ చేస్తేనే నత్తనడక నడిచే పనులు.. ఇప్పుడు ఆ మాత్రమైనా ముందుకు సాగట్లేదు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన చెక్కులు ఇప్పటికే ఒకసారి రిటర్న్ అయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 77 శాతమే పన్నులు వసూలయ్యాయి. గ్రేటర్ నుంచి వరంగల్ కలెక్టర్గా బదిలీ అయిన ప్రావీణ్య ఇక్కడ ఇన్చార్జి కమిషనర్గా వ్యవహరిస్తున్నారు. రెగ్యూలర్ర్ పనులతో బిజీ ఉంటున్న ఆమె గ్రేటర్ ఇన్చార్జి కమిషనర్, కుడా వైస్ ఇన్ చార్జి చైర్మన్గా పూర్తి స్థాయిలో టైం కేటాయించలేకపోతున్నారు. మొత్తంగా మూడు వారాలుగా గ్రేటర్ అడ్మినిస్ట్రేషన్ దెబ్బతింటోంది.
చెక్కులపై మేడం సంతకం చెల్లలే
వరంగల్ కలెక్టర్గా ప్రావీణ్య బాధ్యతలు తీసుకున్న సమయంలోనే గ్రేటర్ కార్పొరేషన్కు ఇన్ చార్జిగా నియమిస్తూ మున్సిపల్శాఖ పెద్దలు మౌఖికంగా ఉత్తర్వులు ఇచ్చినట్లు చెప్పారు. కార్పొరేషన్ పరిధిలో సీఎం అష్యూరెన్స్, పట్ట ణ ప్రగతి, ఎస్సీ సబ్ప్లాన్ తదితర కోట్లాది రూపా యల పనులకు ప్రభుత్వం బిల్లులు మంజూ రు చేసింది. కాంట్రాక్టర్ల అకౌంట్లోకి విడుదల చేస్తూ గ్రేటర్ ఆఫీసర్లు ఇష్యూ చేసిన చెక్కులపై ఇన్చార్జి కమిషనర్ ప్రావీణ్య సంతకం చెల్లలేదు. గ్రేటర్ 'ఫుల్అడిషనల్ ఇన్చార్జి ' కమిషనర్గా అఫిషీయల్గా ఎలాంటి ఉత్తర్వులు రాలేదనే కారణంతో దాదాపు 15 చెక్కులు ట్రెజరరీలో నిలిపివేశారు. దీంతో అటు ఆఫీసర్లు ఇటు కాంట్రాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే సకాలంలో బిల్లులు రావట్లేదని అడపాదడపా ధర్నాలు చేస్తున్న క్రమంలో.. తమ చెక్కులు వెనక్కు వెళ్లడంపై కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పన్ను వసూళ్లు తగ్గినయ్
గ్రేటర్ లో 2022-–23 ఆర్థిక సంవత్సరానికి కేవలం 77 శాతం పన్ను వసూళ్లు మాత్రమే అయ్యాయి. 15 ఏళ్లలో ఏనాడూ 90 శాతం కంటే పన్నుల వసూళ్లు తగ్గలేదు. మొత్తం పన్నులు కలిపితే రూ.52 .83 కోట్ల బకాయిలు ఉండిపోయాయి. ఆస్తిపన్ను వసూళ్ల టార్గెట్ రూ.87.54 కోట్లు కాగా రూ.67.74 కోట్లు మాత్రమే వసూలు చేశారు. ఈ లెక్కన 77.38 శాతమే అయింది. ఆస్తి పన్ను రూ.19.80 కోట్లకు తోడు నల్లా పన్ను రూ.26.45 కోట్లు, చెత్త పన్ను రూ.6 .58 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. జీహెచ్ఎంసీ తర్వాత అత్యధిక డేటా గ్రేటర్ వరంగల్దే . కాగా గ్రేటర్ ఈ –---ఆఫీస్ను ఇక్కడి నుంచి ఎత్తివేసి మున్సిపల్శాఖ పర్యవేక్షణలో నడుస్తున్న సెంటర్ ఫర్ గుడ్ గవర్ననెన్స్ లోకి డేటాను అప్లోడ్ చేసింది. ఈ క్రమంలో పలుమార్లు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. దీన్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేసేందుకు కమిషనర్ లేకపోవడంతో సమస్య సకాలంలో పరిష్కారం కాలేదు. పన్నులు ఆశించిన విధంగా వసూలు కాలేదు.
ఏ పనీ ముందుకు కదలట్లే..
గ్రేటర్ ఆఫీసర్లకు స్మార్ట్ సిటీ పనులు సవాల్గా మారాయి. ఆరేడేండ్లుగా ఎన్నో రివ్యూలు, మానిటరింగ్ చేస్తే తప్పా ముందుకు సాగడం లేదు. వీటికి తోడు సీఎం అష్యూరెన్స్, పట్టణ ప్రగతి, ఎస్సీ సబ్ ప్లాన్, ఎండా కాలం వాటర్ సప్లై నేపథ్యంలో లీకేజీల కంట్రోల్, వర్షాకాలం వరద ముంపు లేకుండా నిర్మించాల్సిన గ్రౌండ్ డక్ట్ పనులు, నాలాలు, కల్వర్టుల నిర్మాణం లాంటి ఎన్నో సవాళ్లు ఉన్నాయి. మార్చి 31న కేవలం ఒక్కసారి మాత్రమే తూతూ మంత్రంగా రివ్యూ నిర్వహించారు. కార్యక్రమం మొత్తం కొత్త కలెక్టర్ను సన్మానించుకోడానికే అన్నట్లు నిర్వహించారు. వరంగల్ కలెక్టర్గా ప్రావీణ్య ఎంతో బిజీగా ఉంటున్నారు. జిల్లావ్యాప్తంగా వడగండ్ల వాన పంట నష్టాల సర్వే, మన ఊరు మన బడి వంటి కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు చూడటానికే సమయం చాలడం లేదు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ డెవలప్మెంట్పై ఇది ఎఫెక్ట్ చూపుతోంది.