అంధ బాలికపై అత్యాచారం.. సీతక్క సీరియస్

అంధ బాలికపై అత్యాచారం.. సీతక్క సీరియస్
  • ఉన్నతస్థాయి కమిటీతో విచారణ జరపాలని ఆదేశం
  • హాస్టల్ ఇన్​చార్జ్ వార్డెన్​ను సస్పెండ్​ చేసిన కలెక్టర్
  • కొనసాగుతున్న విచారణ.. త్వరలో మంత్రికి రిపోర్టు

హైదరాబాద్/ఎల్బీనగర్, వెలుగు: హైదరాబాద్ మలక్‌‌పేట అంధ బాలికల హాస్టల్​లో బాలికపై అత్యాచార ఘటనపై మ‌‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సీరియస్​అయ్యారు. ఉన్నతస్థాయి కమిటీ నియమించి స‌‌మ‌‌గ్ర విచార‌‌ణ చేప‌‌ట్టాలని ఆదేశించారు. హాస్టల్​వార్డెన్​ను వెంటనే స‌‌స్పెండ్ చేయాల‌‌ని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులు, సిబ్బందిపై సీరియస్​యాక్షన్​తీసుకోవాలని స్పష్టం చేశారు. 

బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని, సత్వరమే న్యాయం అందేలా చూడాలని చెప్పారు. నిందితుడికి క‌‌ఠిన శిక్ష పడేలా శాఖాపరమైన చర్యలు తీసుకోవాల‌‌ని ఆదేశించారు. స్పందించిన హైదరాబాద్​కలెక్టర్​అనుదీప్​ దురిశెట్టి ముగ్గురు అధికారులతో ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. కమిటీ చైర్మన్​గా దివ్యాంగుల సాధికారత శాఖ డైరెక్టర్, కమిషనర్ బి.శైలజ, సభ్యులుగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి డి.ఆశన్న, దివ్యాంగుల సాధికారత శాఖ అసిస్టెంట్​డెరెక్టర్ ఎ.రాజేందర్ ఉన్నారు. విచారణ అనంతరం నివేదికను మంత్రి సీతక్కకు పంపనున్నారు. హాస్టల్ ఇన్​చార్జ్​ వార్డెన్​ బి.స్వప్నను కలెక్టర్​సస్పెండ్ చేశారు. 

అసలేం జరిగిందంటే.. 

వికారాబాద్​ జిల్లాకు చెందిన బాలిక(8) మలక్‌‌పేట ప్రభుత్వ అంధ బాలికల హాస్టల్​లో ఉంటూ మూడో తరగతి చదువుతోంది. కాగా, హాస్టల్​బాత్రూమ్స్​క్లీన్ చేసే స్కావెంజర్ నరేశ్(25) ఈ నెల 7న ఉదయం బాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గుర్తించిన వంట మనిషి పద్మ బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. ఆ వెంటనే తల్లిదండ్రులు హాస్టల్​కు చేరుకుని ఇన్​చార్జ్​ వార్డెన్ ​స్వప్న, కేర్ టేకర్ పద్మను నిలదీయగా, పాప మెచ్యూర్ ​అయిందని, ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. 

అయితే అప్పటికే బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు నిలోఫర్ హాస్పిటల్‌‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు పాపపై అత్యాచారం జరిగిందని తేల్చారు. వెంటనే బాధిత తల్లిదండ్రులు మలక్​పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు 16న నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. 24న స్కావెంజర్ నరేశ్(25)ను అదుపులోకి తీసుకున్నారు. విషయం బయటికి రాకుండా మేనేజ్​ చేశారు. మంత్రి, కలెక్టర్ ఆదేశాలతో ఉన్నతస్థాయి కమిటీ సభ్యులు గురువారం హాస్టల్‌‌ను సందర్శించారు.